తెలంగాణా ఇంత పీఆర్సి ఇచ్చిందా? వాళ్ళ ట్రాప్ లో పడొద్దు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సి విషయంలో రగడ కొనసాగుతోంది. ఉద్యోగ సంఘాల నాయకులు పిఆర్సి పై ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని, హెచ్ఆర్ఏ ను తగ్గించటం ఏమాత్రం సమంజసం కాదని ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరాత్రి ప్రకటించిన పిఆర్సికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు కలెక్టరేట్ లను ముట్టడించారు. ఇక ఈ ముట్టడి కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరి కొందరు ముఖ్య నాయకులను గృహనిర్బంధం చేశారు. ఇక తాజాగా పిఆర్సి రగడ పై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు.

ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఇది కాదు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై కచ్చితంగా చర్చలు జరుపుతుందని ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఇది కాదని గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దిగజారినా సరే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐఆర్ ఇచ్చి ఉండకపోతే ప్రభుత్వానికి 18 వేల కోట్ల రూపాయల భారం పడేది కాదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చూస్తున్నామని, ఉద్యోగులకు నష్టం చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు
రాష్ట్ర పరిస్థితిని చూసి అందరూ అర్థం చేసుకోవాలని ఆయన పదేపదే విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగుల విషయంలో ఎప్పుడూ మొండిగా వెళ్లలేదని, కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు పలికారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఉద్యోగులు ఆవేశాలకు లోనుకావద్దని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మిమ్మల్ని ద్వేషించినా అసభ్య పదజాలంతో దూషించినా వారి ట్రాప్ లో పడొద్దు అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఉద్యోగులు పునరాలోచించాల్సిన అవసరం ఉంది
హెచ్ఆర్ఏ పై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని, ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచిందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు పునరాలోచించాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించే ప్రభుత్వం ఇది అని ఆయన పేర్కొన్నారు.

పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇంత పీఆర్సి ఇచ్చిందా?
కరోనా పరిస్థితులతో ఏ రాష్ట్రంలో నైనా 27 శాతం ఐఆర్ ఇచ్చారా? పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పిఆర్సి లేదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీల మాదిరిగా ఆలోచించవద్దు అని హితవు పలికారు. ప్రభుత్వంపై పది వేల కోట్ల రూపాయల భారం పడుతున్న 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులను చర్చలకు పిలిచి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్న శ్రీకాంత్ రెడ్డి ముఖ్యంగా ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్ లో పడొద్దు అంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications