జగన్, చంద్రబాబు ఎదురుపడితే ? ఎట్టకేలకు తప్పించిన పోలీసులు-నోవాటెల్ లో టెన్షన్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో వైఎస్ జగన్, చంద్రబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు ఉన్నాయి. అసెంబ్లీలోనే ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం కానీ, పలకరించుకోవడం కానీ చేయని జగన్, చంద్రబాబు బయట కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారు. తాజాగా రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో సైతం గవర్నర్ తో ఇద్దరూ విడివిడిగా భేటీ అయ్యారు. అలాంటిది ఇవాళ నోవాటెల్ హోట్లలో దాదాపు ఇద్దరూ ఎదురుపడినంత పనయింది.
వైఎస్ జగన్, చంద్రబాబు వైరం
పదేళ్ల క్రితం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులతో వైఎస్ జగన్, చంద్రబాబు మధ్య వైరం ప్రారంభమైంది. జగన్ తో పోలిస్తే రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు అప్పటికే రెండుసార్లు సీఎంగా పనిచేశారు కూడా. తనకున్న రాజకీయ అనుభవంతో జగన్ ను అణగదొక్కేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
కాంగ్రెస్ సాయం చేసినా తాత్కాలికంగా జైలుకు పంపడం మాత్రమే సాధ్యమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పేరెత్తితేనే జగన్ మండిపడే పరిస్ధితులు ఉంటున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో పలకరింపులు తప్పితే బయట కూడా వీరిద్దరూ ఎదురుపడేందుకు సైతం ఇష్టపడటం లేదు.
రాజ్ భవన్లోనూ ఎడమొహం పెడమొహం
తాజాగా రాజ్ భవన్లో గవర్నర్ హరిచందన్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ ఎట్ హోం కార్యక్రమంలో జగన్, చంద్రబాబు ఇద్దరికీ ఆహ్వనం అందింది. ఇద్దరూ వెళ్లారు. కానీ అక్కడ కూడా ఎవరి పని వారు చేశారు. అంటీముట్టనట్టుగా ఉండిపోయారు.
ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్ధితుల్లో గవర్నర్ సమక్షంలోనే వీరిద్దరూ ఎవరికి వారుగానే ఉండిపోయారు. దీంతో జగన్, చంద్రబాబు చాన్నాళ్ల తర్వాత ఒకే వేదికపైకి వస్తున్నారన్ని, కనీసం పలకరించుకుంటారని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. ఇవాళ మరోసారి విజయవాడలో వీరిద్దరు ఎదురుపడే పరిస్ధితి వచ్చింది.
నోవాటెల్ లో టెన్షన్
విజయవాడ నోవాటెల్ లో ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ కాసేపు బస చేశారు. ఉదయం ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన ఎన్వీ రమణ కాసేపు టిఫిన్ చేసేందుకు నోవాటెల్ కు వచ్చారు. ఆ సమయంలోనే సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చారు. ముందు సీఎం జగన్ వెళ్లి ఎన్వీ రమణను కలిశారు. అనంతరం చంద్రబాబు కూడా వెళ్లి సీజేఐ రమణతో మూడేళ్ల తర్వాత భేటీ అయ్యారు. అయితే ఈ లోపే చాలా జరిగింది. దీంతో స్ధానిక పోలీసులకు ఆ గంటసేపు టెన్షన్ తప్పలేదు.
జగన్, చంద్రబాబు ఎదురుపడకుండా..
నోవాటెల్ హోటల్లో సీజేఐ ఎన్వీ రమణతో భేటీ కోసం ముందుగా జగన్ వచ్చారు. అయితే ఆయన వెళ్లిపోక ముందే చంద్రబాబు కూడా అక్కడికి వచ్చారు. ఎన్వీ రమణ వరుస కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఆయన్ను కలిసేందుకు వీరిద్దరూ ఆ కాస్త సమయంలోనే ప్రయత్నించారు. దీంతో వీరిద్దరూ సీజేఐని కలిసేందుకు పోలీసులు, ప్రోటోకాల్ అధికారులు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. వీరిద్దరిలో ఏ ఒక్కరూ సీజేఐని కలవలేకపోయినా, ఇబ్బందులు కలిగించినా ఎన్వీ రమణ ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుంది. దీంతో పోలీసులకు వీరిద్దరూ కలవకుండా చేసేందుకు నానా టెన్షన్ పడాల్సి వచ్చింది.
విజయవాడ పోలీసుల చాకచక్యం..
నోవోటెల్ హోటల్ కు వచ్చిన సీఎం జగన్ ను సెల్లార్ మార్గం ద్వారా వెళ్లి సీజేఐ ఎన్వీ రమణను కలిసి అదే మార్గంలో తిరిగి వెళ్లిపోయేలా పోలీసులు ప్లాన్ చేశారు. అలాగే అదే సమయంలో వచ్చిన చంద్రబాబు ను నోవోటెల్ హోటల్ ప్రధాన ద్వారం పోర్టుకో ద్వారా వెళ్లి సీజేఐని కలిసి తిరిగి వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. తద్వారా ఇద్దరూ ఎక్కడా ఎదురుపడకుండా సమయస్ఫూర్తి ప్రదర్శించారు. దీంతో జగన్, చంద్రబాబు ఇద్దరూ ఎదురుపడకుండా ఎవరికి వారు సీజేఐని కలిసి వెళ్లిపోయారు. అనంతరం సీజేఐ కూడా కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్లిపోయారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.