నదిలో చిక్కుకున్న మంత్రులు, ప్రజల అవస్థలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, అచ్చెన్నాయుడు నాగావళి నది వరద నీటిలో మంగళవారం చిక్కుకుపోయారు. తుపాను బాధితులను పరామర్శించి తిరిగి వస్తుండగా వరద నీటిలో ఎన్డీఆర్ఎప్ బోటు మొరాయించింది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత మంత్రులిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
శ్రీకారుళం జిల్లాలో నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బోటు కాసేపు మొరాయించింది. బోటు మొరాయించడంతో అధికారులు, బోటులో ఉన్న వారు కొంత ఆందోళనకు గురయ్యారు.
విశాఖకు వెంకయ్య, నరసింహన్

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖకు రానున్నారు. ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వెంకయ్య తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళవారం విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు.
విశాఖలో తాగునీరు, పాల కోసం ప్రజల అవస్థలు
తుపాను ప్రభావంతో విశాఖ నగర ప్రజలు తాగునీరు, పాల కోసం అవస్థలకు గురవుతున్నారు. మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచపోవడంతో అపార్ట్మెంట్లు, ఇళ్లలో మోటార్లు పనిచేయకుండా పోయాయి. మున్సిపల్ ట్యాంకర్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు చేతిపంపులను ఆశ్రయిస్తున్నారు. నిత్యావసరాలు దొరకక విశాఖ ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు నిత్యావసరాలను బ్లాక్మార్కెట్లో విక్రయించి సొమ్ము దండుకుంటున్నారు.
రైల్వే లైన్ల మరమ్మతులు వేగవంతం
హుధుద్ తుపాను బీభత్సానికి విజయవాడ-విశాఖపట్నం జంక్షన్ల మధ్య నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు మంగళవారం సాయంత్రం నుంచి పునరుద్దరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి యుద్ధప్రాతిపదికన రైల్వే లైన్ల మరమత్తులు జరుగుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ అధికారులతో పాటు రైల్వే బోర్డు అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావడంతో దక్షిణ మధ్య రైల్వేలోని మెకానికల్, ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తం రైల్వే పునరుద్దరణ పనులపై దృష్టి సారించింది.
తుపాను ధాటికి ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్న ఎలమంచిలి- నర్సింగపలి జంక్షన్లలో ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేశారు. ఇక నర్సింగపల్లి-బయ్యవరం జంక్షన్లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి మరమ్మతులు పూర్తి చేసి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే లైన్లలో రైళ్లు రాకపోకలను పునరుద్దరించనున్నారు.
విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చే జంక్షన్లో రాకపోకలను రేపు ఉదయం పునఃప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జంక్షన్ల మధ్య మొట్టమొదటిసారిగా డిజిల్ ఇంజిన్లతో రైళ్లను నడుపనున్నారు. రేపు మధ్యాహ్నానికి ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ లైన్లు సైతం మరమ్మతులు పూర్తి అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications