హుధుద్ పెనుతుఫాన్: కోలుకుంటున్న విశాఖ(పిక్చర్స్)
విశాఖపట్నం: హుధుద్ పెను తుఫాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన విశాఖపట్నం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పెను తుఫాను ధాటికి విద్యుత్, రవాణా, సమాచారం లాంటి రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తుఫాను శాంతించిన మూడు రోజులకు అంటే బుధవారం నుంచి విశాఖ ప్రజలు కొంత సాధారణ జీవనం గడుపుతున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం, రవాణా సదుపాయాలు కల్పించడం లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో జరగడం లేదు. చౌక ధరల దుకాణాలు, నిత్యావసర దుకాణాలు, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి.
విశాఖపట్నం ప్రజలు విద్యుత్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువులు ఇంకా పలు ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి రాలేదు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చర్యలను చేపడుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలోనే ఉండి సహాయ కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. రూ. 3కే కూరగాయలు, రూ. 5కే కిలో ఆలుగడ్డలు అందిస్తున్నట్లు తెలిపారు. 25కిలోల బియ్యాన్ని, ఆలుగడ్డలు, పామాయిల్, మిరప్పొడి, ఉప్పు లాంటి నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. చేనేత, మత్స్యకారులకు 50కిలోల బియ్యం, నిత్యావసరాలు అందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తక్కువ ధరకే అన్ని నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు తెలిపారు.
తుఫాను ప్రభావంతో కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువులను అత్యధిక ధరలకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకు ఒక పాల ప్యాకేట్ను రూ. 100కు అమ్మకాలు జరిపారు. కాగా, బుధవారం వివిధ జిల్లాల నుంచి కూరగాయలు, పాలను అధికారులు విశాఖ నగరానికి తీసుకొచ్చి ప్రజలకు అందజేస్తున్నారు. తుఫాను ప్రభావిత జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించామని ఏపిఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
విజయవాడ-విశాఖపట్నం మధ్య తుఫాను కారణంగా కొట్టుకుపోయిన రైలు పట్టాలకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. తుఫాను కారణంగా 180కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, భారీ వర్షాలతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ జిల్లాల్లో పెద్ద పెద్ద చెట్లు, పంటలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
తుఫాను కారణంగా ఈ జిల్లాలో మంగళవారం రాత్రి వరకు 25మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 1.35లక్షల మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందినట్లు చెప్పారు. 6,85,000 మంది ప్రజలకు ఆహార పదార్థాలను అందించామని అధికారులు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విశాఖనగరంలో పర్యటించి తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లను ప్రకటించారు.
ఎగిరిపోయిన కోళ్లఫారం పైకప్పు
హుధుద్ పెను తుఫాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన విశాఖపట్నం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
స్వస్థలాలకు..
పెను తుఫాను ధాటికి విద్యుత్, రవాణా, సమాచారం లాంటి రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఏటిఎంల వద్ద బారులు
తుఫాను శాంతించిన మూడు రోజులకు అంటే బుధవారం నుంచి విశాఖ ప్రజలు కొంత సాధారణ జీవనం గడుపుతున్నారు.
విరిగిపోయిన చెట్లు
నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం, రవాణా సదుపాయాలు కల్పించడం లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది.