కోడిపందాలా! మజాకా?: రూ.900కోట్ల బెట్టింగ్.. ఒక్కో గేమ్ రూ.15కోట్లు
ఒక్కో కోడిపందానికి రూ.15కోట్ల దాకా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
భీమవరం: సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందాల జోరు మొదలవుతుంది. ఎక్కడెక్కడివాళ్లో ఇక్కడ వాలిపోయి కోడిపందాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ క్రమంలో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతుంది.
ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా కోడిపందాల బెట్టింగ్ జోరుగా సాగుతోంది. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు సాగే ఈ కోడిపందాల కోసం ఇప్పటికే దాదాపు రూ.900కోట్ల బెట్టింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి దీనిపై సమాచారం అందినట్టుగా తెలుస్తోంది.
చోటా మోటా గల్లీ లీడర్లు మొదలు బడా బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల దాకా ఈ కోడిపందాల్లో పాల్గొంటున్నట్టుగా సమాచారం. విదేశాల్లో ఉండే ఎన్నారైలు సైతం కోడిపందాల కోసం గోదావరి జిల్లాల్లోని తమ స్వస్థలాలకు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.
ఒక్కో కోడిపందానికి రూ.15కోట్ల దాకా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కొంత ఉండటంతో నగదు రహిత ట్రాన్సాక్షన్స్ ద్వారానే చాలామంది ఎన్నారైలు కోడిపందాల్లో పాల్గొంటున్నారని సమాచారం.
జోరుగా జరిగే కోడిపందాల కోసం జనం పోటెత్తుతుండటంతో కొత్తగా కొన్ని మద్యం దుకాణాలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పాన్ షాపులు వెలిసినట్టుగా తెలుస్తోంది. కేవలం కోడిపందాల్లో నగదు బదిలీ కోసమే కొంతమంది కొత్తగా ఖాతాలు తెరిచారన్న వాదన కూడా వినిపిస్తోంది.