విజయవాడలో భారీ దోపిడీ: 7కిలోల బంగారం అపహరణ, కత్తులు, తుపాకులతో..
విజయవాడ నగరంలో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగలు తయారుచేసే కార్ఖానాలోకి చొరబడిన ఆగంతకులు సుమారు 7 కిలోల బంగారు నగలు దోచుకెళ్లారు.తుపాకులు, కత్తులతో బెదిరింపులకు గురిచేశారు.
కృష్ణా: విజయవాడ నగరంలో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగలు తయారుచేసే కార్ఖానాలోకి తుపాకులు, కత్తులతో చొరబడిన ఆగంతకులు సుమారు 7 కిలోల బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన విజయవాడ గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో చోటు చేసుకుంది.
ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్కు చెందిన శంకర్ మన్నా గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలోని రెండంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో బంగారు నగలు తయారుచేసే కార్ఖానా నిర్వహిస్తున్నారు. మూడు గదుల్లో నడుస్తున్న ఆ కార్ఖానాలో 30 మంది పనిచేస్తుంటారు. వారంతా బెంగాల్కు చెందినవారే.
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కార్మికులు నగలు తయారుచేస్తుండగా 10 నుంచి 15 మంది ఆగంతకులు తుపాకులు, కత్తులతో లోనికి చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులను ఒకచోటకు చేర్చి చేతులు పైకెత్తించి కూర్చోవాలని ఆదేశించారు. వారు అలా చేయగానే అక్కడ ఉన్న సుమారు 7కిలోల బంగారు, వెండి ఆభరణాలను బ్యాగులోకి సర్దుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే కార్ఖానా యజమాని సోదరుడు సుభాష్ మన్నా, మరో వర్కరు తేరుకుని వారిని వెంబడించారు. కార్మికులు వెంబడించడాన్ని గుర్తించిన ఆగంతకులు కార్ఖానా సమీపంలో నిలిపిన తెల్లకారులో (వెర్టిగో)కి ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించారు. సుభాష్ మన్నా కారుపై దాడిచేసి సైడ్ మిర్రన్ను ధ్వంసం చేశారు.
అయితే దుండగులు కారును మరింత స్పీడుతో ముందుకెళ్లారు. ఈ తతంగాన్ని గమనించిన నైట్ డ్యూటీ కానిస్టేబుల్ బైక్పై కారును వెండించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కాగా, దోపిడీకి పాల్పడిన వారు అందరూ హిందీలోనే మాట్లాడారని, 25-30ఏళ్ల లోపువారే ఈ పాల్గొన్నారని కార్ఖానా చెప్పారు.
చోరీ సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఎనిమిది పోలీసు బృందాలు వాహనాల తనిఖీలు చేపట్టాయి. తాడేపల్లి ప్రాంతంలో వాహనాలను తనిఖీచేస్తున్న పోలీసులను చూసిన నిందితులు కారును రోడ్డుపై వదిలి పొలాల్లోకి పరారయ్యారు. కారును పరిశీలించిన పోలీసులకు కారులో రెండురౌండ్ల బుల్లెట్లు లభించాయి. కారులోంచి ఆరుగురు దిగి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన దుండగులు మార్గంమధ్యలోనే బంగారంతో దిగిపోయి ఉంటారని భావిస్తున్నారు.