TTD: వైకుంఠ ద్వార దర్శనంలో వీఐపీల రద్దీ - సర్వదర్శనంపై ఈవో కీలక సూచన..!!
Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తలు బారులు తీరారు. తెల్లవారు జాము న 1:40 గంటల నుంచి 5:15 గంటల వరకు ప్రముఖులను శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది. అంచనాలకు మించి భక్తులు వస్తుండటంతో టోకెన్లు లేనివారిని క్యూలైన్లలోకి టీటీడీ అధికారులు అనుమతించడం లేదు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు ఉత్తర ద్వారం తెరుచుకోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. రోజుకు 80 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. జనవరి 1 వరకు అంటే పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనం కల్పించనున్నారు. ఉదయం 5:15 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించింది. తెల్లవారుజామునే శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు.

సుప్రీం కోర్టు మాజీ సీజె ఎన్వీ రమణ దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, హిమా కోహ్లీ, స్పీకర్ తమ్మినేని సీతారాం సహా పలువురు మంత్రులు శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వీఐపీలకు 4వేల పాసులు జారీ చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటల పాటు ప్రముఖులను దర్శనానికి అనుమతించామన్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన 70 వేల మంది భక్తులను నిత్యం దర్శనానికి అనుమతిస్తామన్నారు. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications