సీమాంధ్ర రాజధాని: ఇవన్నీ ఉండాలి, కేంద్రం సూచన
హైదరాబాద్: సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం, నీరు, సహజ వనరులుండేలా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్కు కేంద్రం విధి విధానాలను పంపించింది. అందులో పలు సూచనలు చేసింది. ముందుగా రాజధాని ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశం గురించి డేటా సంపాదించిన తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించింది.
సమస్యతో ముడివడి ఉన్నవారిని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్నీ, సీమాంధ్రలో ఏర్పడే కొత్త ప్రభుత్వాన్నీ, కేంద్రాన్నీ సంప్రదించిన తర్వాత ఆగస్టు 31లోగా నివేదిక సమర్పించాలని కేంద్రం స్పష్టీకరించింది. రాజధాని ఏర్పాటు చేసేందుకు అవసరమైతే నిస్సారవంతమైన అటవీ భూమిని రిజర్వేషన్ నుంచి తప్పించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కూడా కేంద్రం చెప్పింది. కేంద్రం సూచించిన వాటిల్లో... కొత్త రాజధాని ప్రణాళికాబద్ద అభివృద్ధికి అనువైన విధంగా ఉండాలి.

ముందుగా ఎంత జనాభా ఉంటుందో, ఎన్ని జోన్లుగా విభ జించాలో నిర్ణయించుకోవాలి. రాజ్భవన్, చట్టసభలు, సెక్రటేరియట్, హైకోర్టు, కార్యాలయాలు, విద్య, శిక్షణా సంస్థలు, విమానాశ్రయం, గెస్టు హవుస్తలు, నివాస వసతులు, స్టేడియమ్స్, పార్కులు, వినోద వసతులు, గ్రంథాలయాలు, ప్రదర్శన శాలలు, సినిమా హాళ్లు, పర్యాటక స్థలాలు, మార్కెట్లు తదితర వాటికి స్థలం లభించేలా ఉండాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ, ప్రస్తుత ఉమ్మడి రాజధానికి అనువుగా, రైళ్లు, వాహనాలు, విమానాల రాకపోకలకు వీలుగా ఉండాలి.
రాజధానిలో రాపిడ్ మాస్ ట్రాన్సిట్ వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించాలి. ఈ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు వేగవంతంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మౌలిక సదుపాయాలతో అభివృద్ది చెందేట్లుగా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు అధ్యయనం చేయాలి. రాజధాని ఏర్పాటు చేసేటప్పుడు సాధ్యమైనంత మేరకు ఆప్రాంతంలో వ్యవసాయం దెబ్బతినకుండా, ప్రజలు నిర్వాసితులు కాకుండా చూసుకోవాలి.
స్థానిక పర్యావరణ పరిస్థితులు, సహజసిద్ధమైన నదులు, కాల్వలు, చెరువులు, బావులు దెబ్బతినకుండా చూడాలి. రాజధానిని నిర్మించేటప్పుడు కాలుష్యం పెరిగిపోకుండా చర్యలు తీసుకోవాలి. వరదలు, తుఫాన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు జరిగే ప్రాంతం కాకుండా ఉండాలి. నిర్మాణవ్యయం సాధ్యమైనంత తగ్గించేలా ఉండాలి.












Click it and Unblock the Notifications