అనుమానంతో భార్యను హత్య చేసిన సైకో
కరీంనగర్ జిల్లా ఇరుకుల్లా గ్రామానికి చెందిన తుంల్లపల్లి వాసు (33)కు మేనమామ కూతురు శ్రీలత (26)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాయి పార్థు (7), కూతురు సింధు (5) ఉన్నారు. వాసు కుటుంబం మూడేళ్లుగా రామంతపూర్లో నివాసం ఉంటోంది.
వాసు వాక్యూం క్లీనర్ రిపేరర్ కాగా, శ్రీలత చిక్కడపల్లిలో బ్యూటిషియన్గా పనిచేస్తోంది. గత కొంత కాలంగా భార్యపై వాసు అనుమానం పెంచుకున్నాడు. దాంతో గొడవ పడుతూ వచ్చాడు. మతిస్థిమితం లేనట్లు ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో కూడా చూపించుకున్నాడు.
శ్రీలతను హత్య చేయాలని నిర్ణయించుకున్న వాసు కూతురిని తన తల్లి వద్దకు పంపించాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వాసు కుమారుడికి పది రూపాయలు ఇచ్చి చాక్లెట్లు కొనుక్కోమని పంపించాడు. తర్వ ాత భార్య కళ్లలో కారం కొట్టి కూరగాయల కత్తితో గొంతు కోసి చంపేశాడు. తర్వాత ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. వీలు కాకపోవడంతో హత్యకు ఉపయోగించిన కత్తి, కారం ప్యాకెట్లను చేతితో పట్టుకుని బయటకు వచ్చాడు.
స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అతను అసలు విషయం చెప్పాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.