Bullet Train తొలి స్టాప్ ఇక్కడే. అమరావతి నుంచి కీలక అప్ డేట్
తెలుగు రాష్ట్రాల ప్రజల దశాబ్దాల కల అయిన 'బుల్లెట్ రైలు' ప్రాజెక్టు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక హైస్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించిన రూట్ మ్యాప్ క్లియర్ అవుతోంది. ముఖ్యంగా 'హైదరాబాద్-అమరావతి-చెన్నై' బుల్లెట్ రైలు మార్గాన్ని రాజధాని అమరావతి నగరం మీదుగానే పోయేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
గతంలో రావెల అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఈ మార్గాన్ని నిర్మిస్తే బాగుంటుందని భావించినప్పటికీ.. అలా చేస్తే విజయవాడకు, రాజధాని నగరానికి బుల్లెట్ రైలు దూరమవుతుందని అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయం కంటే రాజధాని నగరానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు పాత రూట్ లోనే అంటే.. అమరావతి మీదుగానే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసి, డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయాలని 'నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్' (NHSRCL) సంస్థకు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.

మూడు ప్రధాన బుల్లెట్ రైలు కారిడార్ల పూర్తి వివరాలు:
1. హైదరాబాద్ - అమరావతి - చెన్నై కారిడార్ (మొత్తం పొడవు: 760.09 కి.మీ.)
- ఈ కారిడార్ మొత్తం 18 స్టేషన్లతో మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది.
- తెలంగాణ (180.32 కి.మీ): హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి.
- ఆంధ్రప్రదేశ్ (518.54 కి.మీ): దాచేపల్లి (మొదటి స్టేషన్), అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి (విమానాశ్రయం వద్ద).
- తమిళనాడు (61.23 కి.మీ): తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్రోడ్/మింజూర్, చెన్నై సెంట్రల్.
- ప్రయాణ సమయం: కానీ ప్రస్తుతం రైళ్లలో ప్రయాణం 12 గంటలు పడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్ నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ కేవలం 2 గంటల 55 నిమిషాలు అంటే సుమారు 3 గంటల లోపే చేరుకోవచ్చు.
2. చెన్నై - బెంగళూరు కారిడార్ (మొత్తం పొడవు: 306 కి.మీ.)
ఈ రూట్లో అడవులు, నగరాల గుండా రైలు వెళ్లేందుకు వీలుగా భారీ సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం (ఫారెస్ట్) దెబ్బతినకుండా ఉండేందుకు పలమనేరు సమీపంలో ఏకంగా 11.8 కి.మీ. పొడవైన అండర్ గ్రౌండ్ టన్నెల్ (సొరంగం) నిర్మించనున్నారు. అలాగే చెన్నై సెంట్రల్ వద్ద 1.73 కి.మీ, బెంగళూరులో రెండు చోట్లా కలిపి 14.79 కి.మీ మేర సొరంగాలు వస్తాయి.
- స్టేషన్లు (మొత్తం 7): తమిళనాడులో చెన్నై సెంట్రల్, పూనమల్లె, పరందూరు.. ఏపీలో చిత్తూరు.. కర్ణాటకలో కోలార్, కొడిహళ్లి, వైట్ఫీల్డ్, బయప్పనహళ్లి.
- తిరుపతి - చిత్తూరు కనెక్టివిటీ లింక్: హైదరాబాద్-చెన్నై రూట్ తిరుపతి ఎయిర్పోర్ట్ మీదుగా, చెన్నై-బెంగళూరు రూట్ చిత్తూరు మీదుగా వెళ్తుండటంతో.. ఈ రెండింటినీ కలుపుతూ 'తిరుపతి-చిత్తూరు' మధ్య ఒక ప్రత్యేక అనుసంధాన హైస్పీడ్ కారిడార్ను కూడా నిర్మించబోతున్నారు. దీనిపై కూడా అధికారులు సర్వే ప్రారంభించారు.
3. హైదరాబాద్ - బెంగళూరు కారిడార్ (మొత్తం పొడవు: 597 కి.మీ.)
- రాయలసీమ మీదుగా కర్ణాటకను కలిపే ఈ కారిడార్లో మొత్తం 15 స్టేషన్లను ప్లాన్ చేశారు.
- తెలంగాణ (239 కి.మీ): హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, ఆమనగల్లు, మన్ననూర్/పెన్మిల, సోమశిల.
- ఆంధ్రప్రదేశ్ (264 కి.మీ): కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం.
- కర్ణాటక (94 కి.మీ): అలిపురా, దేవనహళ్లి, కొడిహళ్లి.
ఈ భారీ బుల్లెట్ రైలు ప్రాజెక్టులు గనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిపోనుంది.














Click it and Unblock the Notifications