చంద్రబాబు ఇంటికి మోహన్ బాబు, గంటకుపైగా భేటీ: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు మోహన్ బాబు.
చంద్రబాబుతో మోహన్ బాబుతో భేటీ
చంద్రబాబుతో దాదాపు గంటకుపైగా మోహన్ బాబు సమావేశమయ్యారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు ఇంటికి మోహన్ వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారని తెలిసింది. అయితే, ఈ భేటీపై ఇద్దరు నేతలు కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ భేటీలో మోహన్ బాబుతోపాటు ఆయన కూతురు లక్ష్మి కూడా ఉన్నారు.
అప్పుడు టీడీపీని విమర్శించి.. ఇప్పుడు వైసీపీకి దూరమైన మోహన్ బాబు
కాగా, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు మోహన్ బాబు. అప్పటి వరకు కూడా టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. ఎన్నికల సమయంలోనూ టీడీపీ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు మోహన్ బాబు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మోహన్ బాబుకు మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ సినిమా ఇండస్ట్రీ పెద్దలను కలిసినప్పుడు కూడా మోహన్ బాబు దూరంగానే ఉన్నారు. ఈ పరిణామాలతో వైసీపీకి మోహన్ బాబు దూరమైనట్లు అంతా అనుకున్నారు.
హాట్ టాపిక్గా ద్రబాబుతో మోహన్ బాబు భేటీ
ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ కావడం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా, ఇటీవల తాను బీజేపీ మనిషినంటూ మోహన్ బాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మరోసారి కూటమి కట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు, చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓట్లు చీలకుండా ఉండేందుకు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ పెద్దలు మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కానీ, ఎన్నికల సమయానికి ఏ పార్టీతో ఏ పార్టీలు చట్టాపట్టాలేసుకుంటాయో చెప్పడం కష్టమే.
చంద్రబాబుతో మోహన్ బాబు భేటీపై టీడీపీ క్లారిటీ
ఇది ఇలావుండగా, చంద్రబాబును మోహన్ బాబు కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ వద్ద సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉందని.. ఆ కార్యక్రమానికి చంద్రబాబును ఆయన ఆహ్వానించినట్లు వెల్లడించింది. కాగా, మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.