13 మందిపై రౌడీ షీట్, పోలీసు హెచ్చరిక (ఫొటో)
హైదరాబాద్: నేరాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్న 13 మందిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ ఎసిపి ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం రౌడీ షీట్ తెరిచారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ల పరిధుల్లో ఈ 13 మందిని పోలీసు అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో వారిని ఇన్స్పెక్టర్ పి. మురళీకృష్ణతో కలిసి ఎసిపి మీడియా ముందు ప్రవేశపెట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధుల్లో నిరుడు నేరాలకు పాల్పడినవారి వివరాలు సేకరించి, నేరాలను అరికట్టేందుకు కొత్త రౌడీషీట్లు తెరిచినట్లు ఎసిపి మీడియాతో చెప్పారు.
అవసరమైతే ఎప్పుడైనా రౌడీషీట్ల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాజాగా రౌడీషీట్లు నమోదైన వారు పదేళ్ల పాటు ఎలాంటి గొడవలకు వెళ్లకుండా మంచి నడవడికతో మెలిగితే రౌడీ షీట్లు తొలగిస్తామని ఆయన చెప్పారు.
థామస్ డేవిడ్, ఎస్కె అక్బర్ అలీ, మొహమ్మద్ కమాలుద్దీన్, అరిక్ రాజ్, కె ఆనంద్, పి. శ్రీధర్లపై రౌడీ షీట్లు తెరిచారు. కాగా, 50 మందిపై హీస్టరీ సస్పెక్ట్ షీట్లు తెరిచినట్లు పోలీసులు చెప్పారు.