టీడీపీ-బీజేపీ తప్పులో నాకూ బాధ్యత: పవన్, రసాభాస, విరిగిన కుర్చీలు
తుళ్లూరు: సార్వత్రిక ఎన్నికలలో తాను బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతిచ్చాని, ఆ పక్షాల తరఫున ఏదైనా తప్పు జరిగితే అందులో తనకు కూడా బాధ్యత ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం అన్నారు. ఆయన రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తుళ్లూరులో ఆయన మాట్లాడారు. రైతులకు ఇష్టంలేని గ్రామాలను రాజధానిలో కలపవద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. రైతులకు న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బీజేపీ - టీడీపీ పక్షాల తరఫున తప్పు జరిగితే అందులో తనకూ బాధ్యత ఉంటుందన్నారు.
రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రశ్నించారు. 15వేల ఎకరాలు కూడా చాలా ఎక్కువే అన్నారు. వైసీపీకి చెందిన గ్రామాల వారే భూసేకరణ వ్యతిరేకిస్తున్నారని కొందరు మంత్రులు చెప్పారని, అయితే రైతులు ఏ పార్టీకి చెందినవారన్నది తనకు ముఖ్యం కాదని, వారికి న్యాయం జరగాలన్నదే తన ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
రాజకీయాలు అవసరం లేదు కానీ..
తనకు రాజకీయాలు అవసరం లేదని పవన్ అంతకుముందు అన్నారు. అయితే, ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సినిమాల ద్వారా మీరు నా పైన చూపించే ప్రేమ నాకు చాలన్నారు. కానీ ఇలాంటి వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు.
ఇంకా దేహీ అనొద్దు
ఏపీకీ ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అందరూ కలిసి కట్టుగా పోరాడాలని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని హితవు పలికారు. ఇంకెంత కాలం మనం దేహీదేహీ అని అర్తిద్ధామని వ్యాఖ్యానించారు. కాగా, రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. ఎక్కువగా రైతులతోనే మాట్లాడిస్తున్నారు.
ఉండవల్లి పర్యటన రసాభాస
పవన్ కళ్యాణ్ పర్యటన రసాభాసగా మొదలైంది. ఉండవల్లిలో పవన్ పాల్గొన్న మొదటి సభ అభిమానుల అత్యుత్సాహం కారణంగా కొంత ముందుగానే ముగిసింది. పవన్ వచ్చినప్పటి నుంచి అభిమానులు గందరగోళం సృష్టించారు. దీంతో పవన్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. సభా ప్రాంగణంలో తగిన ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో సభలో గందరగోళం జరిగింది. దీంతో పవన్ సైతం అసహనం వ్యక్తం చేశారు.
పవన్తో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన రైతులు సభ ముందుగానే ముగియడంతో తీవ్ర నిరాశ చెందారు. ఎంతో ఆశగా సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అభిమానులు సృష్టించిన గందరగోళంతో కుర్చీలన్నీ విరిగిపోయాయి. సభ ముగించుకుని పవన్ వెళ్తున్నప్పుడు కూడా తొక్కిసలాట జరిగింది. పవన్ వైపు దూసుకెళ్లేందుకు అభిమానులు యత్నించారు. దీంతో అతికష్టం మీద పవన్ అక్కడి నుంచి బయటపడ్డారు.