రఘురామ కృష్ణరాజుతో నన్ను పోలుస్తారా? వైఎస్ ఫ్యామిలీని ఎదిరిస్తే..: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
కడప: మరో రఘురామ కృష్ణంరాజులా మారారంటూ వస్తున్న ఆరోపణలు, విమర్శలపై జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే తనకు రాజకీయ భవిష్యత్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాను తొలి నుంచీ వైయస్సార్, జగన్ అభిమానిని అని తెలిపారు.
నేను జగన్ విధేయుడిని..: సుధీర్ రెడ్డి
మంగళవారం కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో తనను పోల్చడం దారుణమని అన్నారు. రఘురామ ఎందుకు అలా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదన్నారు. అయితే, తాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ విధేయుడినేనని చెప్పుకొచ్చారు. ఆయన రాజీనామా చేయమంటే వెంటనే చేస్తానని చెప్పారు.
వైఎస్ కుటుంబాన్ని నేను విమర్శిస్తానా?
‘నాపై అసత్య ప్రచారాలు వద్దు. వైఎస్ కుటుంబాన్ని ఎదురించినోళ్లు ఇంతవరకు ఎవరూ బాగుపడలేదు. రఘురామ కృష్ణంరాజు, ఆదినారాయణ రెడ్డి లాంటోళ్లే ఇళ్లలో కూర్చుని ఉన్నారు. జమ్మలమడుగులో నా గెలుపునకు కారణం ఎంపీ అవినాశ్ రెడ్డి. అలాంటి కుటుంబాన్ని నేనెందుకు తిడతాను. నామీద వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు. తుది శ్వాస వరకు వైఎస్ కుటుంబానికి కార్యకర్తగా ఉంటా. ఇకనైనా అసత్య ప్రచారాలు మానండి' అని సుధీర్ రెడ్డి కోరారు.
Recommended Video
సుధీర్ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి
కాగా, 2019 ఎన్నికల్లో డాక్టర్ సుధీర్ రెడ్డి వైసీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 51వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఎన్నికల ఫలితాల అనంతరం రామసుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి.. రామసుబ్బారెడ్డికి మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.