పిఎంఓ నుంచి ఫోన్: సుజనా, ఆశపడలేదన్న దత్తన్న
హైదరాబాద్: ప్రధాని కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిన మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి తెలిపారు. తనకు మంత్రివర్గంలో ఏ శాఖ కేటాయించినా న్యాయం చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృష్టి చేస్తానని సుజనా చౌదరి చెప్పారు.
కాగా, గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సుజనా చౌదరి పేరును ప్రధాని కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. అయితే సుజనాకు సహాయ మంత్రి పదవి ఇస్తామని ప్రధాని ప్రతిపాదించగా, తమకు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి కావాలని టిడిపి కోరినట్లు సమాచారం.
పదవుల కోసం ఆశపడలేదు: దత్తన్న
తాను ఎప్పుడూ పదవులకు కోసం ఆశపడలేదని భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రమంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కితే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
ఆదివారం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి బండారు దత్తాత్రేయకు ఫోన్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ ఢిల్లీకి పయనమయ్యారు.
కాగా, అటల్ బీహారీ వాజ్పేయి ప్రభుత్వంలో బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా పని చేశారు. తెలంగాణ బిజెపిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఆయనకు కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించాలని భావించినట్లు తెలుస్తోంది.