ఇదే నా చివరి మెసేజ్: రుద్రవరం ఎస్ఐ అదృశ్యం, చివరకు బ్రహ్మంగారి మఠంలో..
కర్నూలు: జిల్లాలోని రుద్రవరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విష్ణునారాయణ అదృశ్యం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి ఎస్ఐ విష్ణు నారాయణ పోలీసుల వాట్సాప్ గ్రూప్లో సందేశం పెట్టి అదృశ్యమయ్యారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

చెడుగా అనుకోవద్దంటూ..
‘ఈ మెసేజ్ చదివే సమయానికి నేను బతకవచ్చు లేక చనిపోవచ్చు. దయచేసి నన్ను అందరూ చెడుగా అనుకోవద్దు' అని ఎస్ఐ తన వాట్సాప్ సందేశంలో ఇతర సభ్యులుకు తెలియజేశారు. కాగా, ఆళ్లగడ్డ డీఎస్పీ ఆ సందేశం చూసి ఆ రాత్రే ఎస్ఐ ఇంటికి వెళ్లారు.

తెల్లవారుజామున ఇంటి నుంచి..
ఎస్ఐతో మాట్లాడి ఎలాంటి దారుణ నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్ఐకి డీఎస్పీ సూచించారు. అయినప్పటికీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎస్ఐ విష్ణునారాయణ ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, సమాచారం అందుకున్న పోలసులు విష్ణునారాయణ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ మందలింపు..
కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఎస్పీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎస్ఐ విష్ణునారాయణకు పిలుపురావడంతో ఆయన వెళ్లారు. రుద్రవరంలో ఓ గొడవ కేసులో ఎస్పీ ఆదేశించినప్పటికీ కేసు నమోదు ఆలస్యం చేశారనే విషయంలో ఎస్ఐని పిలిపించినట్లు తెలిసింది. రెండ్రోజుల ఆలస్యంగా కేసులు నమోదు చేయడంపై ఎస్ఐని మందలించినట్లు సమాచారం.

ఇదే నా చివరి మెసేజ్ అంటూ..
ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఎస్ఐ విష్ణునారాయణ ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. ఆ తర్వాత ఇదే నా చివరి మెసేజ్ అంటూ పోలీసు అధికారుల వాట్సాప్లో సందేశం పెట్టడంతో ఉన్నతాధికారులు ఆయన ఇంటికి వచ్చారు. సీఐతోపాటు డీఎస్పీ ఎస్ఐ ఇంటికి వచ్చి విష్ణునారాయణకు నచ్చజెప్పారు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.

కుటుంబసభ్యుల ఆందోళన.. చాగలమర్రి టోల్గేట్ నుంచి ఎస్ఐ..
కాగా, చాగలమర్రి వద్ద టోల్ గేట్ నుంచి ఎస్ఐ విష్ణునారాయణ తన కారులో వెళ్లినట్లు తెలిసింది. ఎస్ఐ విష్ణునారాయణ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో న్యాయంగా వ్యవహరించినప్పటికీ మందలించడంతో విష్ణునారాయణ మనస్తాపం చెందారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రాత్రి అంతా పడుకున్న తర్వాత ఆయన వెళ్లిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు.
బ్రహ్మంగారి మఠంలో..
ఇది ఇలావుండగా,ఎస్ఐ విష్ణునారాయణ ఆదివారం మధ్యాహ్నం ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజుకు ఫోన్ చేసి తాను మైదుకూరు మండలం బ్రహ్మంగారి మఠంలో ఉన్నట్లు సమాచారం అందించారు. దీంతో పోలీసు అధికారులతోపాటు కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications