ఒప్పుకోలేదు: టీలో అసెంబ్లీపై కోడెల, శిక్షణ తరగతులు
హైదరాబాద్: అసెంబ్లీ మార్పు అంశంపై తాను ఒప్పుకోలేదని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ శుక్రవారం అన్నారు. ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. తాను తెలంగాణ సభాపతితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని చెప్పారు. అసెంబ్లీ మార్పు అంశంపై తాను అంగీకరించలేదని చెప్పారు.
అసెంబ్లీలో వసతుల కొరత నిజమేనని చెప్పారు. రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఒకేసారి జరిగినా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. శాసన సభ సభ్యులకు ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు కోడెల తెలిపారు. సభా వ్యవహారాలపై సభ్యులకు పూర్తి అవగాహన కల్పించేందుకే ఈ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ తరగతుల్లో సభ్యులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సీనియర్ పార్లమెంటేరియన్ నజ్మా హెప్తుల్లాలే కాక రాజ్యాంగ నిపుణులు సుభాష్ కశ్యప్, వినోద్ రాయ్ తదితరులు హాజరు కానున్నారని కోడెల చెప్పారు. గ్రాండ్ కాకతీయాలో శిక్షణ తరగతులు ఉంటాయని చెప్పారు. శిక్షణ తరగతులకు ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు.