11 కేసుల్లో ఏ-1గా ఉన్న వ్యక్తిని నేను అనుసరించాలా?: ఎంపీలతో చంద్రబాబు
Recommended Video
అమరావతి: అక్రమాస్తులు, క్విడ్ ప్రోకోలకు సంబంధించి 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాను అనుసరించడం ఏంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం ఎంపీలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. తాము అవిశ్వాసం పెడతామని, టీడీపీ మద్దతివ్వాలని జగన్ డిమాండ్ చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.
11 కేసుల్లో ఏ1, అలాంటి వ్యక్తి దగ్గర...
అక్రమాస్తులు, క్విడ్ ప్రోకోలకు సంబంధించి 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తి దగ్గర ఇప్పుడు జాతీయ రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో పలు పార్టీల అభిప్రాయాలను ఇప్పటికే అడిగి తెలుసుకున్నానని, ఎన్నో పార్టీలు మద్దతు పలికాయని ఆయన వెల్లడించారు.
ప్రత్యేక హోదా ప్రజల హక్కు...
ప్రత్యేక హోదాను ప్రజలు తమ హక్కుగా భావిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలను, హక్కులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తేలేదని అన్నారు. ‘మనమేమీ గొంతెమ్మ కోరికలను కోరడం లేదు, చట్టంలో ఉన్నవే అడుగుతున్నాం..' అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
అందుకే మంత్రివర్గం నుంచి బయటికి...
ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ను కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రజా ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో టీడీపీకి సహకారాన్ని అందించేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఎంపీలకు తెలిపారు.
నిరసన కొనసాగించండి...
రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా ఇస్తారని నాలుగేళ్ల పాటు ఎదురు చూశామని సీఎం చంద్రబాబు అన్నారు. మిత్ర ధర్మం పాటించి చివరి వరకు చూసినా ఫలితం లేనందునే రాజీనామాలు చేయాల్సి వచ్చిందని ఉద్ఘాటించారు. పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు తమ నిరసనలను కొనసాగించాలని ఆయన టీడీపీ ఏంపీలను ఆదేశించారు.