బీజేపీ అన్యాయం చేస్తోందని ఏడాది క్రితమే చెప్పా, జగన్ డ్రామాలు: కేశినేని నాని
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుందని ఏడాది క్రితమే మినీ మహానాడులో తాను చెప్పానని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారం గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏపీకి అన్యాయం చేశారన్న కడుపుమంటతో అమిత్ షా కాన్వాయ్ పైన దాడి చేసి ఉండవచ్చునని అన్నారు. బీజేపీ అండతో జగన్ సీఎం కావాలని కలలు గంటున్నారని మండిపడ్డారు.
జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత లంకా దినకర్ విమర్శించారు. జగన్ బ్యాచ్ది దుష్ట సంకల్పంగా అభివర్ణించారు. జగన్ బీజేపీతో లాలూచీపడి రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు, రుణమాఫీపై పక్కదోవ పట్టిస్తున్నారని రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్, విజయసాయి కుట్రలు చేస్తున్నారు.
ఏపీకి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేశాయని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శనివారం మండిపడ్డారు. ఏటీఎంలలో ఎక్కడ చూసినా డబ్బు లేదనే బోర్డులు కనిపిస్తున్నాయన్నారు. జీఎస్టీ కారణంగా అన్ని రకాల ధరలు పెరిగాయన్నారు.
ఎవరి సాయం లేకపోయినా అభివృద్ధిలో ముందుకు వెళ్దామంటూ సీఎం చంద్రబాబు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు శ్రీరాముడి లాంటి వాడు అయితే అయితే చినరాజప్ప హనుమంతుడులాంటి వాడని కేఈ కితాబిచ్చారు.