పవన్ ను శంకించొద్దు, బిజెపితో అభిప్రాయబేదాలున్నాయి, కానీ, కెసిఆర్ పై వెనక్కి: బాబు
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
అమరావతి:జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాలను ప్రజా ప్రయోజనానికి వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
రెండు తెలుగురాష్ట్రాల్లో పార్టీని నడిపించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి తాను చేపడుతున్న పలు కార్యక్రమాలను బాబు వివరించారు.
బిజెపితో పొత్తు విషయమై బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయకూడదనే అభిప్రాయాన్ని ఆయన పార్టీ నాయకులకు వివరించారు.హోదాతో ఏ రకంగా రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతోందో, దానికంటే ఎక్కువ నిధులను రాష్ట్రానికి రాబట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.
పార్టీనేతలు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులు , కార్యకర్తలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు వారికి సమయాన్ని కేటాయించనున్నట్టు బాబు చెప్పారు.రెండోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు బాబు ఇంటర్వ్యూ ఇచ్చారు.
పవన్ వ్యక్తిత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదు
సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఏది మంచి ఏది చెడు అనేది నేతలపై ఆధారపడి ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీచేయడంపై ఆయన స్పందించారు.పవన్ కళ్యాణ్ విడిగా పోటీచేయడంలో తప్పేమీలేదనే విధంగా ఆయన అభిప్రాయపడ్డారు.
కెసిఆర్ విమర్శలపై స్పందించడానికి నిరాకరణ
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై చేసిన విమర్శలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. వాటిపై తాను మాట్లాడబోనని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేశాను. తన పనితీరు అక్కడి ప్రజలకు తెలుసునని చెప్పారు. నేను విడిగా ఈ విషయమై చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో టిడిపి నేతలు అక్కడి ప్రజల అవసరాలపై ప్రతిపక్షపార్టీగా పనిచేస్తున్నారని చెప్పారు. వారికి పార్టీ నుండి వెన్నుదన్నుగా ఉంటున్నట్టు చెప్పారు. తెలంగాణలో పార్టీని ఎలా నడుపుకోవాలో తెలంగాణ నాయకులకు తెలుసునని చెప్పారు.
పార్టీ నేతలకు సమయం కేటాయిస్తా
తాను పార్టీ నాయకులకు సమయాన్ని కేటాయిస్తానని బాబు చెప్పారు. కుటుంబాన్ని వదిలిపెట్టి రాష్ట్ర అభివృద్దికోసం అమరావతిలో ఉంటున్నానని చెప్పారు. మనవడితో కలిసి ఆడుకోవాలని ఉంటుందన్నారు. అయితే రాష్ట్ర అవసరాలరీత్యా అమరావతిలోనే ఉంటున్నానని చెప్పారు. ప్రజలు ఏ ఆశతో తనకు ఓటుచేశారో ఆ ఆశను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.అందుకే తాను ఎక్కువసమయాన్ని పాలనకోసమే కేటాయిస్తున్నట్టు బాబుచెప్పారు.
సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తాం
బిజెపితో అభిప్రాయభేదాలున్నా ...ఈ విషయాలను బయట మాట్లాడబోమని బాబుచెప్పారు. సంకీర్ణధర్మాన్ని పాటించనున్నట్టు చెప్పారు. రెండు పార్టీల మధ్య సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకొంటామన్నారు. కానీ, బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరైందికాదన్నారు బాబు.
బావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి
పార్టీ నాయకులు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబునాయుడు సూచించారు.ప్రతి ఇంట్లో కుటుంబసభ్యలు మధ్య భేదాభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి. కానీ, అవి హద్దులు దాటకూడదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తగాదాలతో పార్టీని రోడ్డుమీదకు తీసుకురాకూడదని ఆయన కోరారు. రాష్ట్రం కోసం భావోద్వేగాలను అదుపుచేసుకోవాలని ఆయన కోరారు.పార్టీ నేతల గొడవలను ఆయన ప్రస్తావిస్తూ పార్టీకోసం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం మధ్య గొడవలను ఆయన ప్రస్తావించారు. హత్య రాజకీయాలను పార్టీ ప్రోత్సహించదన్నారు బాబు.అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాంను జోక్యం చేసుకోవద్దని తాను చేసిన సూచనను పట్టించుకోవడం లేదన్నారు.
తప్పులు చేయం
తాను కానీ, తన కుటుంబం కానీ ఎట్టిపరిస్థితుల్లో కూడ తప్పుచేసే ప్రసక్తేలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మితిమీరిన డబ్బులు సంపాదించడం ఎందుకు తప్పులు చేసి జైలుకు పోవడానికా అని ఆయన ప్రశ్నించారు. తన కుటుంబం ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకుగాను హెరిటేజ్ సంస్థను ఏర్పాటుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. డబ్బుల కోసం తప్పులు చేయాల్సిన అవసరం తనకు కానీ, తన కుటుంబానికి కానీ లేదన్నారు.
అమరావతిని అభివృద్దిని చేస్తాం
రాజధానికి నిర్మాణానికి భూమి లేదు, డబ్బులేదు. కష్టాలున్నాయని పేద అరుపులు అరుస్తూ కూర్చొంటే ఏమీ జరగదన్నారు. అందుకే వినూత్నంగా ఆలోచించినట్టు చెప్పారు. భూ సమీకరణకు రైతులు సహకరించారు. అమరావతిలో దేశంలోనే అతిపెద్ద ఇన్ ఫ్రా తయారుచేస్తున్నాం. ప్రపంచంలోని ఉత్తమ కంపెనీలు వస్తున్నాయి. ప్రముఖ కంపెనీలకు తక్కువ ధరకు భూములిస్తున్నామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ఏడెనిమిది అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు చెప్పారు.