అఖిల పక్షాన్ని పిలవమని లేఖ రాస్తా, పారిపోను: బొత్స
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యమం, విపక్షాల సమన్యాయం డిమాండ్ నేపథ్యంలో మళ్లీ అఖిల పక్షాన్ని పిలవాలని తాను తమ పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇప్పుడు సమన్యాయం, సమైక్యం అంటున్నాయని ధ్వజమెత్తారు. తాము సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని తాను అధిష్టానాన్ని, కేంద్రాన్ని కోరుతున్నానన్నారు.
సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలను గౌరవించి ఉద్యోగులు, ఇతర వర్గాలు వెంటనే సమ్మెను విరమించాలని కోరారు. ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు జొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయన్నారు. విజయనగరంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమన్నారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. పోలీసులు సంయమనం పాటించాలని కోరారు. మళ్లీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సమన్యాయం అంటే ఏమిటో ఆ పార్టీల నుండి తెలుసుకోవాలని లేఖ రాస్తానని చెప్పారు. తాను సీమాంధ్ర ప్రాంతం నుండి వచ్చానని, అక్కడి ప్రజలకు మనోభావాల ప్రకారం నడుచుకుంటామన్నారు.
విజయనగరంలో తన ఆస్తులపై జరిగిన ఇలాంటి చిన్న చిన్న వాటికి బెదిరే వ్యక్తిని కాదన్నారు. సీమాంధ్రలోని, హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలకు భంగం కలగకుండా, వారికి తలవంపులు రాకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. అందుకు తన శక్తి, సామర్థ్యాలను వినియోగిస్తానన్నారు. చిన్న చిన్న ఘటనలకు పారిపోయే వ్యక్తిని కాదన్నారు.
తాను కాంగ్రెసు పార్టీలో ఈ స్థాయికి వచ్చానన్నారు. తనకు పార్టీతో పాటు సీమాంధ్ర ప్రాంతం ముఖ్యమన్నారు. కర్ఫ్యూ అంటే ఏమిటో తెలియని విజయనగరం ప్రజల పట్ల పోలీసులు సంయమనం పాటించాలని కోరారు.