నెల్లూరుకి ఐసీఎంఆర్ బృందం-ఆనందయ్య మందుపై అధ్యయనం-జగన్ ఆదేశం
నెల్లూరులోని కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు ఇస్తున్న కరోనా మందుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో దీని ప్రామాణికత, పనితీరుపై అధ్యయం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఐసీఎంఆర్ను అధ్యయనం చేయాలని కోరింది. దీంతో ఐసీఎంఆర్ బృందం ఇవాళ నెల్లూరు రానుంది.
Recommended Video
కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై రకరకాల అపోహలు, అనుమానాలు నెలకొన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తే ప్రజల్లో ఎక్కడ విమర్శలపాలవుతామో అని రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు సైతం మాట్లాడేందుకు జంకుతున్నారు. ఇవాళ ఆయుర్వేద మందు ఇస్తామంటూ నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి రోగుల్ని భారీ ఎత్తున కృష్ణపట్నానికి రప్పించారు. దీంతో భారీ రద్దీ నెలకొంది. అయితే ఈ మందు ప్రామాణికతపై అనుమానాలు ఉన్నాయని ఆయనే స్వయంగా ప్రకటించారు. దీనిపై అధ్యయనం చేయిస్తున్నామన్నారు.
దీంతో ప్రభుత్వానికి నెల్లూరు ప్రజాప్రతినిధులు ఈ ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయించాలని కోరారు. నెల్లూరు నేతల విజ్ఞప్తిపై స్పందించిన సీఎం జగన్ ఐసీఎంఆర్ను అధ్యయనం చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తితో ఐసీఎంఆర్ బృందం ఇవాళ నెల్లూరు జిల్లాకు రానుంది. ఆనందయ్య మందును పరిశీలించడంతో పాటు దాని ప్రామాణికతపై అధ్యయనం చేయనుంది. అందులో కరోనాకు ఈ మందు బాగా పనిచేస్తుందని తేలితే ఐసీఎంఆర్ ప్రభుత్వానికి దీనిపై సిఫార్సు చేయనుంది. లోపాలున్నట్లు తేలితే అనుమతి నిరాకరించే అవకాశాలూ లేకపోలేదు.