ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే దర్యాప్తు జరిపించండి, రాజధాని మార్చడం ఎందుకు..? చంద్రబాబు నాయుడు
ఆంధప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు అమరావతి అనువుగా ఉంటుందనే రాజధానిగా ఎంపిక చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. తనపై ఉన్న కోపం అమరావతిపై చూపించొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. విజయవాడలో గద్దె రామ్మోహన్రావు చేపట్టిన దీక్షకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. రాజధాని మార్పు ప్రతిపాదన సరికాదని పేర్కొన్నారు.
బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక, అసత్యాల పుట్ట, ప్రభుత్వం చెప్పిందే బొంకింది: చంద్రబాబు
శివరామకృష్ణ కమిటీ సూచనతో..
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని ఎక్కడ పెట్టాలో శివరామకృష్ణ కమిటీ సూచించిందని చంద్రబాబు గుర్తుచేశారు. కమిటీ సిఫారసు మేరకు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశామని చెప్పారు. అమరావతిలో ఇప్పటికే భవనాలు నిర్మాణం పూర్తయ్యాయిని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో రూపాయి పెట్టాల్సిన అవసరం లేదనన్నారు. కానీ జగన్ సర్కార్ కమిటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు.
ఎంక్వైరీ చేయండి..
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే దర్యాప్తు జరిపించాలని సూచించారు. అలా కాకుండా ఏకంగా రాజధానిని మార్చే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. విజయవాడ, గుంటూరే కాదు.. అన్నీ ప్రాంతాల వాళ్లు రాజధానిగా అమరావతి కొనసాగించాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖపట్టణం రాజధాని అయితే అన్ని ప్రాంతాలకు దూరంగా ఉంటుందని పేర్కొన్నారు. అమరావతిలో పునాదులకు ఎక్కవు ఖర్చయ్యాయనేది తప్పుడు ప్రచారం అని.. చరిత్రలో వెలిసిన నాగరికత నదులు పక్కనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
కదం తొక్కుదాం..
అమరావతి రాజధాని మార్పుకు సంబంధించి విపక్షాలన్నీ కలిసి పోరాడాలని చంద్రబాబు కోరారు. రాజధాని గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించాలని సూచించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారే తప్ప.. మూడు రాజధానులు కాదని గుర్తుచేశారు. రాజధాని మార్పుపై వైసీపీ నేతలు విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజధానిపై పార్టీల నేతలు చేసే పోరాటానికి విద్యార్థులు మద్దతు తెలుపాలని కోరారు. అమరావతి జేఏసీకి ప్రజలు విరాళాలు ఇవ్వాలని విన్నవించారు.