జనసేనకు షాక్ తగిలినట్టేనా ? కనిపించని ఆ ఇద్దరు నేతలు ..
అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జనసేన పార్టీ ఉనికి, అస్థిత్వంపై ప్రశ్న తలెత్తింది. అసెంబ్లీలో 1 సీటు గెలవడం, లోక్సభలో ఖాతా తెరవకపోవడంతో ఆ పార్టీ సినీగ్లామర్ను ప్రజలు ఆదరించలేరని స్పష్టమైంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మంగళగిరిలో నిర్వహించిన సమావేశానికి ఆ ఇద్దరు నేతలు డుమ్మాకొట్టడంతో జనసేనానికి షాక్ తగలిందా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
సమావేశానికి డుమ్మా ..?
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మంగళగిరిలో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. పొలిటికల్ ఎఫైర్స్, పార్టీ ముఖ్యులు హాజరయ్యారు. కానీ నాదెండ్ల మనోహర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కనిపించలేదు. దీంతో వారు పార్టీ నుంచి మెల్లగా జారుకుంటున్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎన్నికల సమయంలో పవన్ను అనుకొని ఉన్న నేతలు ఒక్కసారిగా కనిపించకపోవడంతో .. ఏం జరిగిందని పొలిటికల్ సర్కిళ్లో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వీరిద్దరూ నేతలు కీ రోల్ పోషించారు. జేడీ లక్ష్మినారాయణ విశాఖ నుంచి లోక్ సభకు పోటీచేసి ఓడిపోగా .. తెనాలి అసెంబ్లీ నుంచి నాదెండ్ల మనోహర్ బరిలో నిలిచి పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
పవన్ ఓటమి ..
వీరే కాదు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఓడిపోయారు. కేవలం ఒకే ఒక్క అభ్యర్థి రాపాక వరప్రసాద్ మాత్రమే గెలుపొందారు. ఎన్నికల సమయంలో ప్రచారం, టికెట్ల కేటాయింపులో వీరు పవన్ వెన్నంటే ఉన్నారు. సభలు, సమావేశాలతో హోరెత్తించారు. అయితే పార్టీకి ఘోర పరాజయం తర్వాత పత్తాలేకుండా పోయారు. జనసేనానితో కూడా టచ్లో లేరని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన సమావేశానికి కూడా డుమ్మాకొట్టారు. వీరిద్దరూ ప్రముఖ నేతలతో జనసేన పార్టీకి కాస్తో కూస్తో పేరు వచ్చింది. అయితే వీరు కూడా దూరంగా ఉండటంతో .. ఆ పార్టీ ఉనికి ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి తగ్గట్టుగానే గురువారం నాటి తీర్మానంలో పవన్ కల్యాణ్ .. తనతోపాటు పదేళ్లు ఉండే నేతలకు పార్టీలో ఉండాలని కోరడం వీరిని ఉద్దేశించా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీంతోపాటు తనతో ఉంటే కీర్తి, పేరు వస్తాయని .. డబ్బు రాదని పవన్ చెప్పడంలో అంతరార్థం ఏమై ఉంటుందనే చర్చ తెరపైకి వచ్చింది.
కనిపించని నాదెండ్ల, జేడీ
నాదెండ్ల మనోహర్, లక్ష్మినారాయణ డుమ్మాతో జనసేనకు షాక్ తగిలినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పేరున్న నేతలు పార్టీ సమావేశానికి దూరంగా ఉండటం .. పార్టీ వీడేందుకు సంకేతాలే అనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలా అయితే ఆ పార్టీ అనుభవం ఉన్న నేత ఉండరు. దీంతో మళ్లీ పార్టీ పరిస్థితి మొదటికి వస్తుందని వాదించే వారు కూడా ఉన్నారు. అయితే అధినేత మాత్రం .. తన ఊపిరి ఉన్నంత వరకు పార్టీని నడిపిస్తానని చెప్పడం ఆయనకున్న విశ్వాసమో .. లేక అతివిశ్వాసమో అనే వాదించేవారు కూడా ఉన్నారు.