మైనార్టీలకు డిప్యూటీ సీఎం, వడ్డీలేని రుణం : ఏపీ సీఎం చంద్రబాబు వరాలు
కడప : పోలింగ్ సమయం సమీపిస్తోన్న వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాలు ప్రకటిస్తున్నారు నేతలు. మేనిఫెస్టోలో ఇచ్చే హామీలే గాక .. కీలక పథకాలను ప్రకటిస్తూ ముందుకుసాగుతున్నారు. కర్నూలు జిల్లా అలూరు సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మైనార్టీలకు వరాల జల్లు కురిపించారు.
మైనార్టీలకు డిప్యూటీ సీఎం
టీడీపీని ఆశీర్వదించి తిరిగి గెలిపించాలని అలూరు సభలో మైనార్టీలను కోరారు చంద్రబాబు. తమను గెలిపిస్తే మైనార్టీ సంక్షేమం కోసం పాటుపడతానని ఉద్ఘాటించారు. మైనార్టీ నేతకు డిప్యూటీ సీఎం పదవీ ఇస్తామని హామీనిచ్చారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మైనార్టీల అభ్యున్నతి కోసం టీడీపీ కృషి చేస్తుందని గుర్తుచేశారాయన.
వడ్డీలేని రుణం .. ఇస్లామిక్ బ్యాంకు
డిప్యూటీ సీఎం పదవే కాదు మైనార్టీలకు వడ్డీలేని రుణం ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఇందుకోసం వారికి ఇస్లామిక్ బ్యాంకు నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇవాళ శుక్రవారం పవిత్రమైన రోజు .. ప్రార్థన చేసి నిర్ణయం తీసుకొని టీడీపీకి మద్దతు తెలుపాలని కోరారు చంద్రబాబు
మోదీ, జగన్పై విసుర్లు
ప్రధాని మోదీ, విపక్ష నేత జగన్పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. మైనార్టీలకు మోదీ మోసం చేశారని ఆరోపించారు. అలాంటి వారికి జగన్ వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. జగన్ కు ఓటేసినా .. మోదీకి వేసినట్లవుతోందని గుర్తుచేశారు.