ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా...వైద్యుల ఆందోళన...కారణాలివే
గుంటూరు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) స్థానంలో కేంద్రప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్(ఎన్ఎంసిసి) బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు. ఐఎంఎ ఆధ్వర్యంలో గుంటూరు సర్వజనాస్పత్రిలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి జూనియర్ డాక్టర్లు సైతం మద్దతు పలికారు.
ఎన్ఎంసి బిల్లును వ్యతిరేకిస్తున్నభారతీయ వైద్యుల సంఘానికి(ఐఎంఎ) జూనియర్ వైద్యులు మద్దతు తెలుపుతూ గుంటూరు జిజిహెచ్ లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాధారణ వైద్య సేవలు నిలిపివేశారు. అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందిస్తామన్నారు. ఆయుష్ కోర్సులను అల్లోపతితో సమానంగా చూడడాన్ని వ్యతిరేకించారు. ఆయుష్ వైద్యులకు బ్రిడ్జి కోర్స్ అనేది కేవలం మోసపూరిత చర్య అని విమర్శించారు.
వైద్యుల,వైద్య విద్యార్ధుల వ్యతిరేకత...
నేషనల్ మెడికల్ కమిషన్ బిల్-2017(ఎన్ఎంసీ బిల్లు) దేశవ్యాప్తంగా వైద్యుల, వైద్య విద్యార్థుల ఆందోళనలకు తెరతీసింది. మంగళవారం ఈ బిల్లుపై లోక్సభలో చర్చజరుగుతుంది. ప్రధానంగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ), ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోషియేషన్లు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుకు నిరసనగా ఆయా అసోసియేషన్లు నేడు దేశవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చాయి.
ఎన్ఎంసి బిల్లులో ముఖ్యాంశాలు...
ప్రస్తుతం అమల్లో ఉన్నమెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ను ఏర్పాటు చేస్తారు. ఇకపై వైద్య విద్యకు సంబంధించి అన్ని వ్యవహారాలు ఎన్ఎంసీనే చూసుకుంటుంది. అలాగే హోమియోపతి, ఆయుర్వేదం వంటి ఆయుష్ వైద్యుల కోసం ప్రభుత్వం ఒక బ్రిడ్జ్ కోర్సును తీసుకొచ్చింది. ఇది పూర్తి చేసిన ఆయుష్ వైద్యులు అల్లోపతి వైద్యాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఐఎంసీ యాక్ట్లోని క్లాజ్ 15 ప్రకారం ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఔషధాలను సిఫారసు చేయాలి. కానీ కొత్తగా తీసుకొస్తున్న బిల్లులో ఈ క్లాజ్ను తీసి వేయనున్నారు.
బ్రిడ్జ్ కోర్సుపై వ్యతిరేకత ఎందుకంటే...
హోమియోపతి, ఆయుర్వేదం వంటి వాటిని ప్రాక్టిస్ చేసే వైద్యుల కోసం ప్రభుత్వం బ్రిడ్జ్ కోర్సు ఏర్పాటు చేస్తుంది. దీన్ని పూర్తి చేసిన వారిని ఎంబీబీస్ డాక్టర్లుగా గుర్తిస్తారు. వీరు ఇకపై వీరు ఎంబిబిఎస్ డాక్టర్ల లాగే అల్లోపతి వైద్యాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఎంతో ప్రమాదకరమని ఐఎంఏ అంటోంది. ఆయుష్ వైద్యులకు అల్లోపతి అవకాశం ఇవ్వడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని హెచ్చరిస్తోంది. అల్లోపతి చదవని వారికి ఈ వైద్యం ప్రాక్టీస్ చేసేలా అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఎన్ఎంసీలో ఎవరెవరుంటారు...
ప్రస్తుతం ఎంసీఐ సభ్యులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటున్నారు. కానీ కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎన్ఎంసీని కేంద్రం నామినేట్ చేస్తుంది. 25 మంది సభ్యులతో ఈ ఎన్ఎంసీ పాలక మండలిని ఏర్పాటు చేస్తుంది. దీనికి ఒక ఛైర్మన్, 12 మంది ఎక్స్ అఫీసియో సభ్యులు, 11 మంది తాత్కాలిక సభ్యులు, ఒకరు ఎక్స్ అఫిసియో సభ్య కార్యదర్శి ఇందులో ఉంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి ఇందులో స్థానం కల్పిస్తారు. అయితే దీనిపై వైద్యుల వ్యతిరేకత దేనికంటే ఎన్ఎంసీలో సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. ఎన్నికలు ఉండవు. ఇది నిరంకుశత్వానికి దారి తీస్తుందని, ఇలాంటి సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించలేరనీ, ప్రభుత్వానికి విధేయంగా ఉంటారనీ ఐఎంఏ చెబుతోంది.
ఎన్ఎంసిపై ఐఎంఏ వాదన...
ఎన్ఎంసీ బిల్లు-2017 ఎంతో ప్రమాదకరమని ఐఎంఏ మద్దతుదారులైన వైద్యులు చెబుతున్నారు. ఎంసీఐలో అవినీతి పెచ్చు మీరిపోయిందనే వాదనతో ప్రభుత్వం ఈ ఎన్ఎంసి బిల్లు తెస్తోంది. అయితే ఈ అవినీతినే భూతద్దంలో చూపించి మొత్తం ఎంసీఐనే తీసేయడం సరైంది కాదని, వ్యవస్థను సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలే తప్ప దానిని నాశనం చేయడం సమస్యకు పరిష్కారం కాదని వారు వాదిస్తున్నారు.