ఏపీకి వర్షాలు చెప్పిన వాతావరణశాఖ
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వడగాలు కొంత శాంతించాయి. కోస్తా, రాయలసీమ మీదగా చత్తీస్ గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించింది. దీనివల్ల రాబోయే మూడురోజులు ఉత్తర కోస్తాల్లో తేలికపాటి వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో తీవ్ర వడగాలులు, 64 మండలాల్లో సాధారణ వడగాలులు వీయనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న 48 గంటల వ్యవధిలో 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 88 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయి.
ఏజెన్సీ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం వానలు పడ్డాయి. ఉదయం నుంచి ఎండలు మండించగా మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గంటపాటు కురిసిన వానలు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించాయి. ఆ తర్వాత కూడా మబ్బుల వాతావరణం కొనసాగింది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. అత్యధికంగా కొయ్యూరులో 39.0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అరకులోయలో సుమారు గంటన్నర సమయం వాన కురిసింది. వర్షానికి రహదారులు కూడా చిత్తడిగా మారాయి. కుంబిడిసింగి ప్రాంతంలో వడగళ్ల వాన కురిసింది.

మరోవైపు ప్రకాశం, అనకాపల్లి, పల్నాడు, నెల్లూరు, పార్వతీపురం, విజయనగరం ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 82 మండలాల్లో తీవ్ర వగడాడ్పులు వీశాయి. వీలైనంతవరకు ప్రజలు ఉదయం సమయంలోనే పనులను పూర్తిచేసుకోవాలని, మధ్యాహ్నం ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎండలకు వృద్ధులు, గర్భిణులు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమలో కూడా వేడి వాతావరణం కొనసాగింది. నంద్యాల, తిరుపతి, రేణిగుంట, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 134 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications