రుతుపవన వర్షాలపై కీలక ప్రకటన - ఉపరితల ఆవర్తనం, ఎండలతో పాటు..!!
రుతుపవనాలు వచ్చినా వర్షాల జాడ లేదు. వడగాల్పుల తీవ్రత పెరిగింది. జూన్ రెండో వారంలోనూ పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొడిగాలులతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అయిదు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెల 17 తరువాత రాయలసీమ..దక్షిణ కోస్తాల్లో మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మరో రెండు రోజులు వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది.
ప్రారంభం కాని వర్షాలు:రుతుపవనాలు వారం ఆలస్యంగా ప్రవేశించాయి. కానీ ఫలితం లేదు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అసాధారణ తుఫానుగా ఏర్పడి తీరం తాకింది. దాదాపు పది రోజుల పాటు కొనసాగిన తుఫాన్ నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా రుతుపవనాల ప్రవేశం తరువాత ఎండలు తగ్గి వర్షాలు ఆరంభం అవుతాయి. ఈ సారి వాతావరణంలో భిన్న మార్పులు కనిపిస్తున్నాయి.

ఈ సారి జూన్ నెలాఖరు వరకు ఎండలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సారి సుదీర్ఘ వేసవి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 19 నుంచి 23వ తేదీ మధ్య రుతుపవనాలు విస్తరించనున్నాయి. దీంతో 19వ తేదీ తరువాత పలు ప్రాంతాల్లో రుతుపవన వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వడగాల్పుల తీవ్రత:తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో పాటు వడగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 19 వరకు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య దిశ నుంచి వీచిన పొడిగాలులతో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోనూ భారీ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. 210 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..220 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
19 తరువాత వర్షాలు :గురువారం ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5, ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2, తూర్పు గోదావరి జిల్లా చిల్యాల, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.1, తిరుపతి జిల్లా సత్యవేడులో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు (శుక్రవారం) 268 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు, శనివారం 235 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో గాలప్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల తీవ్ర వడగాల్పులు..అనేక చెట్ల గాడ్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 మధ్య ఉత్తర కోస్తాకు రుతువపనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో..మరో మూడు రోజుల పాటు ఇదే విధంగా వేడిగాల్పుల తీవ్రత కొనసాగనుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications