ఏపీకి గుడ్ న్యూస్
AP Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో మొన్నటివరకు చెదురుమదరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయింది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.
ఆ తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. ఫలితంగా ఎండ తీవ్రత పెరిగింది. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం తగ్గిన తరువాత ఎండలు విజృంభించాయి. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత మళ్లీ 40 డిగ్రీల వరకూ చేరుకుంది. కొన్ని మండలాల్లో వడగాల్పులు సైతం వీచాయి.

ఈ పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు ఎప్పుడు పడతాయా? అంటూ ఎదురుచూస్తోన్న రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి భారత వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించాయి.
నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చని చెప్పారు.
అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసేటప్పుడు చెట్ల కింద నిల్చోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే తరహా వాతావరణం శని, ఆదివారాలు కూడా కొనసాగుతుంది. ఆదివారం వరకూ చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని చెప్పారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారింది. శనివారం నాటికి తూర్పు- మధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉంది. 26వ తేదీ సాయంత్రానికి పశ్చిమబెంగాల్- బంగ్లాదేశ్ మధ్య తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఏపీకి తుఫాన్ ముప్పు తప్పిందని కూర్మనాథ్ వివరించారు.












Click it and Unblock the Notifications