ఏపీకి వానలు చెప్పిన వాతావరణశాఖ
ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంటోంది. కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, జంగమేశ్వరపురం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తదితర ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. కావలిలో అత్యధికంగా 6.9 డిగ్రీల తగ్గుదల నమోదైంది.
ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండలతో రాష్ట్రం వేడెక్కింది. దీనివల్ల రాయలసీమ, కోస్తాలో మేఘాలు ఆవరించాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో జల్లులు కురవడంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఉంటుంది.

ఉత్తర కోస్తాలో పిడుగులు పడతాయని అధికారులు తెలిపారు. తేలికపాటి జల్లులతోపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం 39 మండలాల్లో, బుధవారం 66 మండలాల్లో వడగాలులు వీయడానికి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపారు.
నంద్యాల, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. నంద్యాల జిల్లా గోస్సాడులో 44.4, కడప జిల్లా వెడూరులో 44.3, అన్నమయ్య జిల్లాలో 43.1, తిరుపతి జిల్లాలో 42.4, కర్నూలు జిల్లాలో 43.8, అనంతపురం జిల్లాలో 43.2 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవడంతోపాటు 37 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి.












Click it and Unblock the Notifications