విస్తరించిన రుతుపవనాలు - వర్షాల పై కీలక అప్డేట్..!!
రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. రానున్న 48గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నైరుతి విస్తరణలో తీవ్ర జాప్యం నెలకొనడంతో రెండు వారాలకుపైగా తీవ్ర వడగాడ్పులతకు తోడు తీవ్ర వర్షాభావం నెలకొనడం ఖరీఫ్ పనులపై ప్రభావం చూపింది. తెలంగాణలోని ఖమ్మం వరకు గురువారం రుతుపవనాలు విస్తరించాయి.
చల్లబడిన వాతావరణం
నైరుతి రుతుపవనాల విస్తరణతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని..కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని అవమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ విస్తరణకు దోహదం చేసింది. ఏపీతో పాటు పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం మొత్తం, తెలంగాణ, ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. శుక్రవారం మన్యం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రెండు రోజులు భారీ వర్షాలు
అదే సమయంలో పలు ఇతర జిల్లాల్లోనూ వర్షాలపైన అప్రమత్తం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా, గురువారం అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, ధూళిపాళ్లలో 62, చాగల్లులో 59.5, ముప్పాళ్లలో 46 ఎంఎం వర్షం కురిసింది. రుతుపవనాల విస్తరణతో మరో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఖమ్మం వరకు విస్తరణ
తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతపవనాలు గురువారం ఖమ్మం వరకు విస్తరించాయి. ఈ ప్రభావంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబాబ్ నగర్ ప్రాంతాల్లో బుధవారం నుంచి గురువారం పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. నైరుతి ప్రభావంతో రాష్ట్రం చల్లబడింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో 9.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications