తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల రాక ప్రభావంతో రానున్న ఐదు రోజులు పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. IMD హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను నివారించడానికి ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. రుతుపవనాలు ఉత్తర భారతంలో ప్రారంభమై దక్షిణ భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర.. తదితర రాష్ట్రాల్లో మే 19 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు దిల్లీ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫానులు వస్తాయని ఐఎండీ తెలిపింది.
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా పేర్కొంది. ఈ మేరకు తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్లు స్పష్టత నిచ్చింది.

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ఈ నెల 20- 22వ తేదీ నాటికి ఇది మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది అల్పపీడనంగా మారనున్నట్లు తెలిపింది. మే 23 నుంచి 28 మధ్య తుపానుగా మారేందుకు అనుకూలంగా ఉంది. దీనికి శక్తి అని పేరు పెట్టారు. ఇది మరింత బలపడటానికి అనుకూల వాతావరణం ఉంది. ఈ క్రమంలో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications