ద్రోణి ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలకు బయటకు రావడం మానేశారు. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఉదయంపూట చూసుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది.
దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈనెల ఏడో తేదీన ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అంచనా వేసింది.

భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాడ్పులు వీస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 47 డిగ్రీలు, కడప జిల్లా కలసపాడులో 46.4, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ లు జారీచేశారు.
ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాలు, విజయనగరం జిల్లాలో 12 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్ర వడగాడ్పులకు అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలతోపాటు ఉక్కపోత కూడా బాగా పెరిగింది. ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, వైద్యులు చెబుతున్న సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications