బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం- ఏపీకి భారీ వర్షాలు
Heavy rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఇవే పరిస్థితులు ఈ వారం కూడా కొనసాగనున్నాయి. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
దీనికి కారణం- బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం. ఈ నెల 17వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది మరింత తీవ్రరూపం దాల్చింది. గురువారం నాటికి దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రభావం ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుంది. నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
అన్నమయ్య రాయచోటి, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి - మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. తీవ్ర వాయుగుండం ఏర్పడిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే సముద్రం మీదికి వెళ్లిన వాళ్లు తిరిగి రావాలని సూచించారు.
తీర ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, ఇళ్లు, ఇతర భవనాల కింద నిల్చోకూడదని ప్రఖర్ జైన్ సూచించారు.












Click it and Unblock the Notifications