ఏపీ పోలింగ్ హింసాత్మకం : టీడీపీ, వైసీపీ సై అంటే సై, పరిస్థితి ఉద్రిక్తం, అదనపు బలగాల మొహరింపు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ కార్యకర్తలు కత్తులు దూయడంతో ఇద్దరు చనిపోయారు. పలు చోట్ల నేతలను అడ్డుకోవడం, రాళ్లు రువ్వడంతో .. గతంలో ఎన్నడూ లేనివిధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అర్ధరాత్రి వరకు ఆళ్లగడ్డ, తాడిపత్రి, ఉరవకొండలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో .. భారీగా పోలీసు బలగాలను మొహరించారు.
ఆళ్లగడ్డలో ఉద్రిక్తత
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అహోబిలంలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ సోదరి భూమా నాగమౌనిక కారు అద్దాలను వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. గంగుల వర్గీయుల వాహనాల్లో రాళ్లు, కర్రలతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని నాగమౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆళ్లలగడ్డలోని అహోబిలంలో టీడీపీ, వైసీపీ వర్గాలు బాహాబాహికి దిగారు. ఇరువర్గాలు కర్రలతో కొట్టుకుంటూ .. రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఎస్సై సుధాకర్ రెడ్డి, స్వంతత్ర్య అభ్యర్థి కుందూరు రామిరెడ్డి, మరో ఆరుగురు గాయపడ్డారు.
ప.గోదావరిలోనూ ...
పశ్చిమగోదావరి జిల్లాలో కూడా సేమ్ సిచుయేషన్ నెలకొంది. ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకోవడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రత్తికోళ్లలంక గ్రామానికి అదనపు పోలీస్ బలగాలను తరలించారు.

ప్రసాదం పాడు వద్ద కూడా ..
కృష్ణా జిల్లా ప్రసాదంపాడు పోలింగ్ కేంద్రం కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు. అప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని జాతీయ రహదారిపై యార్లగడ్డ వెంకట్రావ్ బైఠాయించారు. దీంతో చెన్నై-కోల్ కతా రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications