ఏపీలో రెండు చోట్ల రీ పోలింగ్ : సీఈసీకి ద్వివేది ప్రతిపాదన
అమరావతి : ఏపీలో రీ పోలింగ్కు సంబంధించి క్లారిటీ వచ్చింది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కేంద్రం .. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన చేసింది.
రెండుచోట్లా ?
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ కేంద్రం, నరసరావుపేటలోని 94వ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్కు ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పంపారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి జనార్ధన్ ద్వివేది పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనను సీఈసీకి పంపించినట్టు వెల్లడించారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
లెక్కింపునకు ఏర్పాట్లు
ఇటు పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు వచ్చేనెల 23న జరిగే లెక్కింపు కోసం మొత్తం 34 ప్రాంతాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు
ఇటు ఈవీఎం, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, జిల్లా కలెక్టర్, పోలింగ్ ఏజెంట్లు, పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలకు సీల్ వేశారు. గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ కోన శశిధర్ పరిశీలించారు. అన్ని గదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పార్టీ అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్ల ఫోన్లకు సీసీ కెమెరాల పర్యవేక్షణ లాగిన్ సదుపాయం కల్పించామని వివరించారు.