చంద్రబాబుకు భారీ ఊరట-లక్ష్మీపార్వతి పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు...
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత, తన అల్లుడు వరసయ్యే చంద్రబాబు ఆస్తులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. అంతే కాదు అత్యున్నత న్యాయస్ధానం ఈ పిటిషన్ దాఖలు చేసిన లక్ష్మీపార్వతిపై కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.
గతంలో చంద్రబాబు ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు కోరుతూ ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత ఆమె దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అక్కడా లక్ష్మీపార్వతికి చుక్కెదురైంది. లక్ష్మీపార్వతి వాదన ఆధారంగా చంద్రబాబు ఆస్తులపై దర్యాప్తుకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే హైకోర్టు తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ దాన్నికొట్టేస్తూ తుదితీర్పు ప్రకటించింది.
చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనడానికి ఆధారాలు లేవని గతంలో ట్రయల్ కోర్టు, హైకోర్టులు తీర్పును వెలువరించినా ఆమె సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. చంద్రబాబుకు, లక్ష్మీపార్వతికి మధ్య రాజకీయ వైరం ఉందన్న విషయాన్ని గతంలో హైకోర్టు పరిగణలోకి తీసుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు సక్రమంగానే ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేదీ తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
సుప్రీంకోర్టులో లక్ష్మీపార్వతి పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆసక్తికర వాదనలు సాగాయి. చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరని లక్ష్మీపార్వతిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి అని ఆమె బదులివ్వగా.. ఎన్టీఆర్ భార్య అనేది అదనపు అర్హత అవుతుందా అని అడిగారు. ఒకరి ఆస్తులు తెలుసుకునేందుకు మీరు ఎవరంటూ సుప్రీం న్యాయమూర్తి లక్ష్మీపార్వతిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎవరి ఆస్తులు ఎవరికి తెలియజేయాలంటూ నిలదీశారు. చివరికి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ లో విచారించదగిన అంశాలు లేవంటూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.