అమూల్కు ప్రభుత్వ నిధులపై హైకోర్టు బ్రేక్- జగన్ సర్కార్కు షాక్- రఘురామదే పైచేయి
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య జరుగుతున్న పోరులో మరోసారి రఘురామదే పైచేయి అయింది. గుజరాత్కు చెందిన అమూల్ డెయిరీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో సహకార పాల ఉత్పత్తుల రంగంలో అమూల్ను రంగంలోకి దింపి జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
అమూల్తో జగన్ సర్కార్ ఎంవోయూ
గుజరాత్కు చెందిన సహకార దిగ్గజం అమూల్తో జగన్ సర్కార్ గతంలో ఓ ఎంవోయూ చేసుకుంది. దీని ప్రకారం ఏపీ డెయిరీతో కలిసి రాష్ట్రంలో పాల ఉత్పత్తి రంగంలో అభివృద్ధే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎంవోయూలో అమూల్ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వ డెయిరీలను పరుగులు తీయిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ మన డెయిరీలను పరుగులు తీయించేందుకు అమూల్ కార్పోరేట్ తరహాలోనే డబ్బులు వసూలు చేసే పరిస్ధితి. దీంతో ప్రభుత్వం అమూల్ డెయిరీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా అమూల్లో పెట్టుబడులు పెడుతోంది.
అమూల్లో పెట్టుబడులపై రఘురామ పిటిషన్
అమూల్ డెయిరీలో ఏపీ సర్కార్ పెట్టుబడుల్ని వ్యతిరేకిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ప్రైవేటు డెయిరీ అయిన అమూల్లో ఎలా పెట్టుబడులు పెడుతుందంటూ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అమూల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనలు అంగీకరించవని, ఇది ప్రజల డబ్బును ప్రైవేటు సంస్ధలకు దోచిపెట్టడమేనని రఘురామ వాదించారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇచ్చింది.
జగన్ సర్కార్కు హైకోర్టు ఝలక్
అమూల్ డెయిరీతో కుదుర్చుకున్న ఎంవోయూ మేరకు ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అమూల్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎలాంటి నిధులు ఖర్చుచేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. అసలు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, గుజరాత్లోని అమూల్కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో అమూల్ కూడా ఇరుకునపడినట్లయింది.
Recommended Video
హైకోర్టు ఉత్తర్వుల్ని స్వాగతించిన రఘురామ
అమూల్ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై పిటిషనర్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. అమూల్తో కుదుర్చుకున్న ఎంవోయూపై నిధులు వెచ్చించొద్దని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఏపీ ప్రజలకు న్యాయం జరుతుందని భావిస్తున్నానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్పై ఉన్న రఘురామరాజు ఢిల్లీ నుంచే ఏపీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్నారు.