స్నానం చేస్తోండగా ఫోటోలు, వీడియోలు : ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపు, గుంటూరులో ఘటన
గుంటూరు : ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. టీనేజర్లనే కాదు .. వివాహితలను కూడా వదలడం లేదు కొందరు కేటుగాళ్లు. భయపెట్టడం, బెదిరించడం వారి నైజం. ఇక చేతిలో మొబైల్ ఉంటే చాలు .. ఫోటోలు, వీడియోలు తీస్తూ తమ శాడిజాన్ని చాటుకున్నారు. తాజాగా గుంటూరులో ఇలాంటి ఓ ఘటన కలకలం రేపుతోంది.
శృతిమించిన ఆగడాలు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం, పదేళ్ల క్రితం గుంటూరు వచ్చింది. ఇక్కడే పనిచేసుకుంటూ ఉంటుంది. అయితే పక్క ఇంట్లో ఉన్న ఓ యువకుడి వికృత చేష్టలు ఇటీవల వెలుగుచూశాయి. వివాహిత స్నానం చేస్తుండగా ఫోటోలు తీశాడు. వీడియోలు కూడా తీసి .. బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. చాలారోజుల నుంచి ఫోటోలు తీసుకున్న .. ఆ వివాహిత పరవుపోతుందని బయటపడలేదు. కానీ ఇటీవల ఆ యువకుడు వివాహితను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. కుమారుడు తప్పు చేస్తే సర్ది చెప్పాల్సిన కుటుంబసభ్యులు కూడా ఇక్కడ గడ్డి తిన్నారు. అతడికే సపోర్ట్ చేయడంతో ఆ మహిళ ఏం చేయాలో తెలియడం లేదు.
బ్లాక్ మెయిల్ ...
ఇటీవల ఇంటి వద్ద వివాహితను యువకుడు, కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారు. ఇంతలో అక్కడికొచ్చిన భర్త .. ఏం జరిగిందని ఆరాతీస్తే అసలు విషయం వెలుగుచూసింది. యువకుడు, కుటుంబసభ్యుల ప్రవర్తనతో ఆ వివాహిత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో మృత్యువుతో పోరాడుతోంది.
నిరసన పర్వం ..
ఆ యువకుడి ఆగడాలపై బాధితురాలి భర్త, స్థానిక మహిళలు నిరసన చేపట్టారు. అరెస్ట్ చేయాలని పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. వారి సమస్యను ఏఎస్పీ ఆలకించారు. వారిచ్చిన ఫిర్యాదు తీసుకోని, చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సదరు యువకుడు, వారి కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తప్పుపడుతున్న ప్రజాసంఘాలు
వివాహిత ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించడంపై ప్రజాసంఘాలు కూడా స్పందించాయ. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే మరికొందరు ఆకతాయిలు ఇలానే ప్రవర్తిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ యువకుడిపై కఠినంగా వ్యవహరిస్తే .. మిగతావారు పిచ్చి చేష్టలు చేసేందుకు వణుకుతారని పేర్కొన్నారు.