జగన్కు మోదీ చెప్పిందేంటి..ఇచ్చిందేంటి : ఏపీకి వచ్చేది రూ. 34.83 వేల కోట్లు: కేంద్రం చెప్పేదేంటి.
Recommended Video
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా కేంద్రం గతంలో చేసిన విధంగా కాకుండా..ఏపీకి ప్రత్యేక కేటాయింపు లు ఉంటాయని అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సైతం కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూసారు. కానీ అవి ఫలించలేదు. ఎప్పుడూ చెప్పిన విధంగానే ఏపీకి మా సహకారం ఉంటుందని చెప్పటమే కానీ..బడ్జెట్లో మాత్రం ఏ రకంగానూ కేటాయింపులు చూపలేదు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుండి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా వచ్చే మొత్తంలో గతం కంటే స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఇక , కేంద్రమే పూర్తి చేయాల్సిన జాతీయ విద్యా సంస్థల కు మాత్రం విదిలింపులే మినహా..కేటాయింపులు లేవు.
ఏపీకి కేంద్రం నుండి రూ.34.83 వేల కోట్లు...
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో 2019-20 ఆర్దిక సంవత్సరానికి ఏపీకి ప్రత్యేకంగా ఎటువంటి కేటాయింపులు లేవు. ఏపీకి కేంద్రం పూర్తగా సహకరిస్తుందని ఇచ్చిన హామీలు అంకెల్లో మాత్రం కనిపించలేదు.సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారినికి ముందుగానే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసారు. ఏపీలో ఆర్దిక పరిస్థితిని పూర్తి స్థాయిలో వివరించారు. కేంద్రం అండగా నిలవాలని అభ్యర్దించారు. ప్రధాని మోదీ సైతం ఇద్దరం కలిసి ఏపీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని ట్వీట్ చేసారు. తిరుమల శ్రీవారి దర్శానానికి వచ్చిన సమయంలోనూ ఏపీకి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కానీ, బడ్జెట్లో మాత్రం ఏపీకి ప్రత్యేకంగా కేటాయింపులు ఏవీ లేవు. కనీసం ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులను సైతం ప్రస్తావించలేదు. జాతీయ విద్యా సంస్థలకు నామ మాత్రంగా విదిలింపులు చేసారు. ఇక, మొత్తంగా ఏపీకి దక్కేది నికరంగా రూ. 34.83 వేల కోట్లు మాత్రమే.
కేంద్ర పన్నుల వాటాలో పెరుగుదల..మిగిలినవి ఇలా..
తాజాగా కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటాలో భాగంగా ఏపీకి గతం కంటే రెండు వేల కోట్లు అదనంగా రానున్నాయి. ఈ ఏడాది ఆ మొత్తం 34,833 కోట్లుగా బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచనా వేసారు. అందులో కార్పోరేషన్ పన్ను కింద రూ 11868.32 కోట్లు, ఆదాయపు పన్ను కింద రూ. 9,072.65 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ కింద రూ. 9,485.62 కోట్లు, కస్టమ్స్ రూ. 2,507.40 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ 1,899.51 కోట్లు కలిపి మొత్తంగా ఏపీకి వచ్చే మార్చి మాసాంతానికి కేంద్రం నుండి ఏపీకి పన్నుల వాటా కింద రూ. 34,833.18 కోట్లు అందుతాయని బడ్జెట్ లెక్కల్లో స్పష్టం చేసారు. ఇక..ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో సెంట్రల్ యూనివర్శిటీకి రూ.13 కోట్లు, గిరిజన యూనివర్శిటీకి రూ.4 కోట్లు కేటాయించారు. తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్లోనూ అదే పద్దులు కొనసాగించారు. మిగిలిన ఏ పద్దులోనూ ఏపికి వాటా దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వి భజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018-19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. కానీ సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు.
కీలక అంశాల ఊసే లేదు..
ప్రధాని మోదీ హామీలు ఇవ్వటంతో ఖచ్చితంగా బడ్జెట్లో ప్రత్యేకంగా ఏపీకి సాయం గురించి ప్రస్తావిస్తారని వైసీపీ ఎంపీ లు అశలతో ఉన్నారు. కానీ, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మళ్లీ మొండి చెయ్యి ఎదురైంది. ఏపీకి కీలకమైన పోలవ రం తో సహ రాజధానికి నిధుల గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పంపిన ప్రతిపాదనల్లో ముఖ్యమైనఏపికి రెవెన్యూ లోటు భర్తీ, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీలు ప్లాంటు, విశాఖపట్నంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం, వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు తదితర అంశాల ప్రస్తావన లేదు. దేశంలో ఉన్న ఎయిమ్స్ సంస్థలన్నింటికీ కలిపి రూ.3,599.65 కోట్లు కేటాయించారు. ఏపిలోని మంగళగిరి ఎయిమ్స్, తెలం గాణలోని బిబి నగర్ ఎయిమ్స్కు వీటి నుంచి కేటాయించే అవకాశం ఉంది. దేశంలోని ఐఐఎంలకు రూ.445.53, ఐఐటిలకు రూ.6,409.95 కోట్లు, ఐఐఎస్ఈఆర్లకు రూ.899.22 కోట్లు, ట్రిపుల్ ఐటిలకు రూ.374.76 కోట్లు కేటాయిం చారు. అందులో ఏపి ఐఐఎం, ఐఐటి, ఐఐఎస్ ఈఆర్, ట్రిపుల్ ఐటిలకు కొద్ది మొత్తంలో కేటాయించే అవకాశముంది.