కరోనా టైమ్ లోనూ రాజకీయ ప్రయోజనాలపై దృష్టి పెట్టటం భావ్యం కాదు : జగన్ కు చంద్రబాబు హితవు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నా వాటిపై శ్రద్ధ పెట్టకుండా రాజకీయ ప్రయోజనాలపై దృష్టి పెడుతున్నారని , అది అంత మంచిది కాదని పేర్కొన్నారు . కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై వైసీపీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆయన అన్నారు .ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ సమయంలో కూడా అసలు సమస్యపై దృష్టి పెట్టకుండా రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ ఏర్పాటుపై సర్వే చేయడం సరైంది కాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు .
టీడీపీ బాటలో జనసేన కూడా .. వైసీపీ నేతల నిర్వాకంపై ఈసీకి ఫిర్యాదు
టీడీపీని, టీడీపీ నాయకులను నిందించడాన్ని మానుకోవాలని లేఖలో పేర్కొన్న చంద్రబాబు
చంద్రబాబు ఇప్పటికే పలు మార్లు సీఎం జగన్ కు లేఖలు రాశారు. పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అయితే అవేవీ పట్టించుకోకుండా కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా సూచనలు చేస్తున్న టీడీపీని, టీడీపీ నాయకులను నిందించడాన్ని మానుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇక రాజకీయ ప్రయోజనాల కన్నా, ప్రజా ప్రయోజనాలే ఎక్కువగా భావించి పనిచేయడం ద్వారా ప్రస్తుత కరోనా సంక్షోభంలో నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు . తక్షణ ఉపశమన చర్యల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
లాక్ డౌన్ సమయంలో కూడా రాజకీయ ప్రయోజనాలా ? చంద్రబాబు ప్రశ్న
ఇలాంటి కష్ట సమయంలో కూడా ప్రభుత్వ చర్యలు చాలా బాధను కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్నా దాని విషయం పక్కన పెట్టి అనేక చోట్ల జేసీబీలతో ఇళ్ల స్థలాలను చదును చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు .ఇక యూనివర్సిటీల పాలకమండళ్ల నియామకంలో ఒకే సామాజికవర్గం వారిని పెద్దఎత్తున నియమించారని అది సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు . లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి రోజువారీ కూలీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు, చేనేత, గీత, మత్స్యకారులు, ఇతర చేతివృత్తులవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, వారికి కూడా తక్షణం రూ. ఐదు వేల సాయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అక్రమ మైనింగ్ ,ఇసుక, మట్టి అక్రమ రవాణా ప్రభుత్వానికి తెలీదా ?
ఒకవైపు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, ఇసుక, మట్టి వందలాది లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారని ఇదంతా ప్రభుత్వానికి తెలీదా అని చంద్రబాబు లేఖలో విమర్శించారు. అన్నిచోట్లా దొంగచాటుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు . నిరుపేదలు ఇంకా ప్రభుత్వ సాయం అందక పడరాని పాట్లు పడుతున్నారని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటం మినహాయించి అన్ని పనులు చేస్తున్నారని సీఎం జగన్ కు చురకలు అంటించారు చంద్రబాబు.
Recommended Video