మోడీ అంగీకరిస్తారా?: ఆ అంశంలో చంద్రబాబు, కేసీఆర్లది ఒకేమాట..!
హైదరాబాద్: శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన అంతరాష్ట్ర మండలి సమావేశంలో నియోజకవర్గాల పెంపు అంశం మళ్లీ తెరపైకొచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఏపీ విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్లు తమ తమ అసెంబ్లీలలో ప్రభుత్వ పరంగా తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. ఈ తీర్మానం ప్రకారం ప్రస్తుతం 175 నియోజకవర్గాలున్న ఏపీలో దానిని 225 స్థానాలకు పెంచాలని చంద్రబాబు కోరారు.
ఇక తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని కేసీఆర్ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అది కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం 2026 వరకూ దేశంలో నియోజకవర్గాల సంఖ్య పెంచే అవకాశం లేదని స్పష్టంగా ప్రకటించడం విశేషం.
దీంతో ఇద్దరు సీఎంలు ఆశలు నెరవేరడం కష్టమేనన్న అభిప్రాయం ఏర్పడింది. అయినప్పటకీ ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అనేక అంశాల్లో విభేదాలున్నప్పటికీ, ఈ ఒక్క అంశంలో మాత్రం వీరిద్దరి మధ్య అభిప్రాయం కుదరడం విశేషం.
ఇదిలా ఉంటే తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. ఇక ఏపీలో సైతం వైసీపీ నుంచి 20 మంది అధికార టిడిపిలో చేరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అధికార పార్టీల్లోకి చేరిన ఎమ్మెల్యేలకు ప్రోత్సహిస్తున్నారు.
అంతేకాదు త్వరలోనే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని, అప్పుడు మీరు పార్టీ మారినా మీ స్థానాలకు వచ్చిన భయమేమీలేదని, మీకు తప్పకుండా టికెట్లు ఇస్తామన్న ప్రతిపాదనతో టీడీపీ-టీఆర్ఎస్ నాయకత్వాలు, తమ రాష్ట్రాల్లోని ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ద్వారా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇద్దరు సీఎంల ప్రతిపాదన పట్ల కేంద్రం సానుకూలంగానే ఉందని గతంలో వెంకయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నియోజగవర్గ పునర్విభజన బిల్లుని పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతామనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గ పునర్విభజన పెంపు వల్ల తమ పార్టీకి అదనంగా వచ్చే లాభమేమిలేదని, రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు ఆ పార్టీ జాతీయ అధినేత అమిత్షాకు స్పష్టం చేశారని తెలుస్తోంది. ఈ కారణం చేతనే ఈ విషయంలో ప్రధాని మోడీ సైతం ఆసక్తి చూపించడం లేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి.