వైఎస్ జగన్కు వార్నింగ్ బెల్స్: ఆ లెక్క తప్పుతోంది: ఎక్కడ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఏంటీ? 2024లో ఎదుర్కొనబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఆయన ఏ లక్ష్యంతో పని చేస్తో్నారు?.. ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లోక్సభ, శాసనసభ సభ్యులు, కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లాస్థాయి అధ్యక్షులతో ఎందుకు సమావేశమౌతోన్నారు?.. ఆయా ప్రశ్నలన్నింటికీ దొరికే సమాధానం ఒక్కటే.. క్లీన్ స్వీప్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 175కు 175 అసెంబ్లీ స్థానాలను గెలిచి తీరాలనే ఉద్దేశమే కనిపిస్తోంది.

అవినీతిరహితంగా..
పార్టీ ప్లీనరీలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారాయన. గతంలో ఎప్పుడు, ఏ ప్రభుత్వం ఊహకు కూడా అందని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, వాటిని నేరుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకే అందజేస్తోన్నామని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల నిధులను లబ్దిదారుల బదలాయించే క్రమంలో ఎక్కడే గానీ అవినీతి అనే మాటకే తావు లేదని, వాటిని నేరుగా అకౌంట్లకు బదిలీ చేస్తోన్నామనీ వివరిస్తూ వస్తోన్నారు.

వై నాట్ 175..
అలాంటప్పుడు 175 అసెంబ్లీ స్థానాలను ఎందుకు గెలవలేమని, గెలిచి తీరాల్సిందేనని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లెక్క ఇప్పుడు తప్పినట్టే కనిపిస్తోంది. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమే అయినప్పటికీ.. క్లీన్ స్వీప్ సాధ్యపడదని, ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకొంటాయనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.

19 సీట్లకే..
జాతీయ స్థాయి న్యూస్ ఛానల్ ఇండియా టీవీ తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్తో ఇది స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే- ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని అభిప్రాయపడింది. 25 లోక్సభ స్థానాలు ఉండగా.. వాటిల్లో ఆరింటిని వైసీపీ కోల్పోతుంది. ఇప్పుడున్న 22 సీట్లను కూడా దక్కించుకోలేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన లోక్సభ సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకోగలుగుతుంది. ఇప్పుడున్న మూడు స్థానాల సంఖ్యను ఆరుకు పెంచుకోగలుగుతుంది.

135 వరకు..
ఈ రేషియోను ఆధారంగా చేసుకుంటే వైఎస్ఆర్సీపీ వచ్చే శాసనసభ స్థానాల సంఖ్య 130 నుంచి 135. అసెంబ్లీలో ఇది మంచి సంఖ్యాబలమే. అందులో సందేహాలు అనవసరం. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సహాయాన్ని తీసుకుని పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ- బీజేపీ మిత్రపక్ష కూటమి ఆ నంబర్ను కూడా అందుకోలేకపోయిన విషయం తెలిసింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని 108కే పరిమితమైంది టీడీపీ అప్పట్లో.

151కి తగ్గినట్టే..
ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం.. వైఎస్ఆర్సీపీకి ఇప్పుడున్న 151 కంటే తగ్గినట్టే అవుతుంది. ఆ సీట్ల మేర ఓటింగ్ శాతం ప్రతిపక్షాల వైపు మళ్లుతుంది. వైఎస్ఆర్సీపీ బలం తగ్గినట్టే అవుతుంది. సార్వత్రిక ఎన్నికల నాటి వాస్తవ ఫలితాల్లో మరింత తగ్గుతుందా? లేక పెరుగుతుందా? అనేది తేలాల్సి ఉంది. పార్టీ అగ్రనాయకత్వం దీనిపై దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదు. అలాగే- టార్గెట్ 175ను అందుకోవడానికి తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయ్యొచ్చు.












Click it and Unblock the Notifications