రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఉత్తరాది రాష్ట్రాలకు దూసుకుపోయేలా కొత్త రైల్వేలైన్ రెడీ!
తెలంగాణా రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త మార్గాల ఏర్పాటు, వివిధ రైల్వే ప్రాజెక్ట్ లతో దూకుడు చూపిస్తుంది. రాష్ట్రంలో రైల్వే పురోగతిలో భాగంగా అనేక ప్రాజెక్ట్ లు వేల కోట్ల రూపాయలతో సిద్ధం అవుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునికతను సొంతం చేసుకుంటున్నాయి.
ఉత్తర భారత రాష్ట్రాలకు ప్రయాణం చేసే ప్రయాణికులకు రైల్వే మరో శుభవార్త
రైల్వే ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు రైళ్ళ సేవలను కూడా పెంచుతుంది. ఇక ఇదే క్రమంలో తాజాగా ఉత్తర భారత రాష్ట్రాలకు ప్రయాణం చేసే ప్రయాణికులకు రైల్వే మరో శుభవార్త చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట నుండి మహారాష్ట్ర లోని బల్లార్శా వరకు 203కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం మరియు విద్యుదీకరణ పనులను రైల్వే పూర్తి చేసింది.

మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే లైన్ నిర్మాణం
సుమారు మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ట్రిప్లింగ్ ప్రాజెక్ట్ లో తెలంగాణాలో 159కిలోమీటర్లు, మహారాష్ట్రలో 44కిలోమీటర్ల మార్గం ఉంది. ఈ రైల్వే లైన్ పూర్తి కావటంతో ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య చివరి 11 కిలోమీటర్ చివరి విడత మూడో లైన్ నిర్మాణంతో పాటు, బీబ్రా నదిపై నిర్మించిన వంతెన కూడా పూర్తి కావటంతో గ్రాండ్ ట్రంక్ రూట్లో రైళ్ల రద్దీ భారీగా తగ్గనుంది.
కొత్త లైన్ తో లాభాలు ఇవే
ఈ కొత్త లైన్ కారణంగా ప్రయాణికుల రైళ్ళు, సరుకు రవాణా రైళ్ళు వేగంగా నడపటం వీలవుతుంది. ఈ మార్గంలో ప్రయాణ సమయం తగ్గటంతో పాటు బొగ్గు, సిమెంట్ వంటి భారీ సరుకుల రవాణా కూడా సులభతరం అవుతుంది. ఇదే సమయంలో వేగంగానూ గమ్య స్థానానికి చేరుతుంది. ఈ లైన్లో విద్యుద్దీకరణ పూర్తి కావటం కారణంగా ఇంధన వ్యయం తగ్గి పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది.
ఉత్తర దక్షిణ భారతదేశాలను అనుసంధానం చేస్తున్న రైల్వే
ఈ లైన్ పూర్తి కావటంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావటం ఉత్తర దక్షిణ భారతదేశాలను రైల్వే అనుసంధానం చేస్తుందని అన్నారు. నిర్మాణ విభాగాల్లో అహర్నిశలు కష్టపడిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ అభివృద్ధి తెలంగాణా ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తుంది.












Click it and Unblock the Notifications