కేంద్ర మంత్రి రాజీనామా! ఢిల్లీ పీఠం వీడి..
కేంద్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను భారత రాష్ట్రపతి ముర్ము వెంటనే ఆమోదించారు. ఆయన రాజ్యసభ ఎంపీ పదవీకాలం ఈ జూన్తోనే ముగియడం, త్వరలోనే పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో ఈ రాజీనామా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో మంత్రిగా ఉండటం కంటే సొంత రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి, రాబోయే శాసనసభ పోరులో ప్రత్యక్షంగా బరిలోకి దిగేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ నేపథ్యం..
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన రవ్నీత్ సింగ్కు రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో కాంగ్రెస్ తరఫున 2009, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలుపొందిన ఆయన, 2024 ఎన్నికలకు ముందు బీజేపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, కమలం పార్టీ ఆయన సామర్థ్యాన్ని గుర్తించి రాజస్థాన్ నుంచి ఖాళీ అయిన స్థానంలో రాజ్యసభకు పంపించి, కేంద్రంలో మంత్రి పదవి కట్టబెట్టింది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనలో ఉన్న సరిహద్దు రాష్ట్రాన్ని దక్కించుకోవడానికి బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా బిట్టూను రంగంలోకి దించుతున్నారు.

కీలక సమీకరణలు.. బీజేపీ సరికొత్త వ్యూహం!
ఇటీవల సినీ రంగంలో సంచలనం సృష్టించిన 'సట్లెజ్' సినిమా వివాదంపై రవ్నీత్ సింగ్ బిట్టూ అత్యంత ఘాటుగా స్పందించి వార్తల్లో నిలిచారు. పంజాబ్ రాజకీయాల్లో పార్టీని గెలిపించేందుకు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని సిక్కులు (58%), హిందువులు (39%), దళితులు (32%) , బిసి సామాజిక వర్గాల (16%) ఓటర్లను ఏకం చేస్తూ బీజేపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా ఆయన క్షేత్రస్థాయికి వెళ్తున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి దృష్టి!
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా రవ్నీత్ సింగ్ బిట్టూ పంజాబ్ రాజకీయాల్లో తమ పార్టీ రేసు మొదలైందనే సంకేతాన్ని ఇచ్చారు. ప్రత్యక్షంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి పార్టీ తరఫున కీలక పాత్ర పోషించబోతున్న బిట్టూ అడుగులు రాబోయే రోజుల్లో పంజాబ్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications