ఉల్లిపాయలపై కేంద్ర ప్రభుత్వ నిషేధం
దేశంలో ఉల్లి ధరలు (Onion Prices) మండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ధరల కట్టడికి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశీయంగా ఉల్లిపాయలను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డిసెంబరు 8 (శుక్రవారం) నుంచే ఈ నిషేధం అమల్లోకి రాబోతోంది. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు కల్పించింది. ఈ నోటిఫికేషన్ విడుదలవడానికి ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్కు అప్పగించిన ఉల్లి లోడ్ను ఎగుమతి చేసుకోవచ్చని DGFT తెలిపింది. ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

దేశీయ మార్కెట్లలో ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఇటీవల కేంద్రం పలుమార్లు ఎగుమతుల పాలసీని సవరించింది. ఈ ఏడాది ఆగస్టులో ఉల్లి ఎగుమతులపై 40శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించారు. ఆ తర్వాత అక్టోబరులో దాన్ని సవరిస్తూ.. ఉల్లికి కనీస ఎగుమతి ధరను (MEP) 800 డాలర్లుగా నిర్ణయించారు. తాజాగా ఎగుమతులపై కేంద్ర నిషేధం అమల్లోకి వచ్చింది. మహారాష్ట్రలో అకాల వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో టోకు వ్యాపారంలో దేశీయ ధరలు కిలోకు రూ. 40కి పైగా పెరిగాయి. ఈ చర్య వల్ల జనవరిలో ఉల్లి ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు, రైతులు అంటున్నారు.












Click it and Unblock the Notifications