Weather Report: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీలో వర్షాలు కురవనున్నాయి. వచ్చే ఐదురోజులు వానలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతోపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు కర్నూలు, నంద్యాల, అనంతపురం, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వానలు పడతాయి.
తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో అత్యధికంగా 28.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. తిరుపతి జిల్లా పుత్తూరు, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కూడా భారీ వర్షాలు కురిశాయి. కడప జిల్లా సింహాద్రిపురంలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఒకవైపు వానలు, మరోవైపు ఎండలతో ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆదివారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎండలు ఠారెత్తించాయి. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల్లోపు బయటకు రావద్దని, అత్యవసరమైతే గొడుగులు ధరించి రావాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.
వైద్యులు చెప్పిన సలహాలు, సూచనలు పాటించాలని, దాహం వేయకపోయినా తరుచుగా మంచినీరు తాగుతుండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఐదురోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వీటితర్వాత ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications