నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ చల్లటి కబురు
నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ విభాగం శుభ వార్త చెప్పింది. ఈ నెలాఖరు అవి కేరళ తీరాన్ని తాకనున్నట్టు వెల్లడించింది. 150 ఏళ్ల చరిత్రలో 1918 మే 11న ముందస్తుగా కేరళ తీరాన్ని తాకాయి. గతేడాది జూన్ 8వ తేదీన ప్రవేశించాయి. ఈ ఏడాది మే 31వ తేదీకి రెండురోజులు అటూఇటూగా ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో క్రమంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
అధిక వర్షపాతం
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కానుంది. ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోవడంతోపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక వేడికి పవర్ గ్రిడ్ లు దెబ్బతినడంతోపాటు నీటి వనరులు ఎండిపోయాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందనే అంచనాలుండటంతో దేశం మొత్తానికి భారీ ఉపశమనం లభించినట్లైంది.

వీటితోనే విద్యుత్తు ఉత్పత్తి
దేశంలో వ్యవసాయ రంగానికి రుతుపవనాలు ఎంతో కీలకమైనవి. సాగు విస్తీర్ణంలో 52 శాతం వీటిపైనే ఆధారపడింది. రుతుపవనాలవల్ల కురిసే వర్షాలతోనే విద్యుత్ ఉత్పత్తితోపాటు రిజర్వాయర్లలో నీటిమట్టం పెరుగుతుంది. వ్యవసాయానికి జూన్, జులై నెలలు అత్యంత ప్రధానమైనవి. ఖరీఫ్ పంటలకు సంబంధించిన విత్తనాలను ఈ సమయంలోనే పొలాల్లో విత్తుతారు. గతేడాది ఎల్ నినోవల్ల ఆశించిన మేర వర్షాలు కురవలేదు. ఈసారి మాత్రం బాగా కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.
ఓవైపు జల్లులు.. ఎండలు
ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఈరోజు గుంటూరు, కృష్ణాతోపాటు కోస్తాలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఓవైపు జల్లులు పడుతున్నాయి.. మరోవైపు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైన పని ఉంటేనే బయటకు రావాలని, వచ్చేటప్పుడు గొడుగు ధరించి రావాలని విపత్తుల నిర్వహణ శాఖ చెబుతోంది.












Click it and Unblock the Notifications