కలలో కూడా ఊహించని సేవలను ప్రారంభించిన రైల్వే
భారతీయ రైల్వేలు రోజురోజుకు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని వందేభారత్ రూపంలో తీసుకొచ్చింది. సెమీ హైస్పీడ్ రైళ్లుగా పట్టాలెక్కిన ఇవి దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఆదరణను చూరగొంటున్నాయి. ప్రధాన నగరాల మధ్య ఉన్న ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో తీసుకువెళ్లడమే ఈ రైళ్ల ప్రధాన ఉద్దేశం. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొనకుండా ఉండేందుకు కవచ్ వ్యవస్థను తీసుకువచ్చారు.
తాజాగా భారతీయ రైల్వే మరో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రైలు మదద్ పేరుతో ఇవి అందుబాటులో ఉంటాయి. ఎక్కువమంది సురక్షితంగా ప్రయాణం చేస్తున్నామని భావిస్తున్నప్పటికీ వారిని ఒక సందేహం కూడా వెంటాడుతుంటుంది. ప్రయాణం మధ్యలో ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులు అందుబాటులో ఉండరు.. పరిస్థితి ఏమిటి? అని. దీనికి రైల్వే పరిష్కారం చూపింది. వారికి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆన్ కాల్ ద్వారా వైద్యుడిని, వైద్యురాలిని సంప్రదించవచ్చు. 24 గంటలు వైద్యులు ఈ సేవలను అందిస్తారు. ఆన్ కాల్ డాక్టర్ సేవలను జూన్ ఒకటో తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు 2109 మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకున్నారు.

ఆడపిల్లకు జన్మనిచ్చింది
వైద్య సదుపాయం అవసరమైతే వెంటనే టీటీఈకి సమాచారం ఇవ్వాలి. టీటీఈ వెంటనే ప్రయాణిస్తున్న రైలు తర్వాత వచ్చే స్టేషన్ మేనేజర్ కు ఫోన్ చేస్తారు. వైద్యం అసవరమైనవారు స్టేషన్ కు వచ్చేసరికి అవసరమైన వైద్య బృందంతో అక్కడ అంతా సిద్ధం చేస్తారు. వీటితోపాటు పార్ మెడికల్ బృందం కూడా ఉంటుంది. దీనివల్ల రైలులో ప్రయాణం చేస్తున్నప్పడు ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా? అనే సందేహాన్ని వదిలివేయవచ్చు.
కొచువేలి-ఎల్టీటీ సూపర్ ఫాస్ట్ రైలులో ఒక ప్రయాణికుడికి గుండె నొప్పి రావడంతో టీటీఈ తర్వాత వచ్చే స్టేషన్ లో వైద్య బృందాలను అందుబాటులో ఉంచి ప్రాణాలు కాపాడారు. కొల్హాపూర్-ముంయి రైలులో కూడా గర్భిణికి పురిటినొప్పులు రావడంతో తర్వాత వచ్చే స్టేషన్ లో వైద్యబృందాన్ని సిద్ధం చేసి రెండు ప్రాణాలను కాపాడారు. ఆమెకు ఆడపిల్ల జన్మించింది. రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇకనుంచి ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని, వైద్యబృందాలు సిద్ధంగా ఉంటాయని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications