తెలుగు రాష్ట్రాలకు మూడు వందేభారత్ రైళ్లు - ఇవీ కొత్త మార్గాలు..!!
తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైళ్లు మరిన్ని దూసుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. టికెట్ ధరల పైన కొంత వ్యతిరేకత కనిపించినా.. సమయం- సౌకర్యంతో ప్రయాణీకులు రాజీ పడుతున్నారు. దీంతో..కొత్తగా మరో మూడు రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. మరి కొద్ది రోజుల్లో ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న లైన్లలో వీటిని నడపాలని నిర్ణయించారు. ఇదే సమయంలో వందేభారత్ రైళ్లను ప్రస్తుతం అందుబాటులో శతాబ్ది - రాజధాని ఎక్స్ ప్రెస్ లకు బదులుగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

మూడు వందేభారత్ రైళ్లకు ప్రతిపాదనలు
తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే మరో మూడు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విశాఖ- సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ కు అదనంగా ఈ మూడు రైళ్లను కేటాయించనున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ - విజయవాడ, అదే విధంగా సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య ఈ రైళ్లను నడపాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ మూడు లైన్లలో నిత్యం వేలాది మంది పలు రైళ్లల్లో ప్రయాణం సాగిస్తున్నారు. కానీ, ప్రతీ రైలులోనూ వెయిటింగ్ లిస్టు భారీగా ఉంటోంది. దీనిని పరిగణలోకి తీసుకొని ఈ మూడు రూట్లలో కొత్తగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రతిపాదనలు అందించారు. సూత్ర ప్రాయంగా ఇప్పటికే ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది.

వందేభారత్ కు పెరుగుతున్న డిమాండ్
వందేభారత్ కు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ కనిపిస్తోంది. ఈ నెల 15న విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణ ధరల పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. ఇతర రైళ్లతో పోలిస్తే భారీగా టికెట్ ఛార్జీలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఈ రైలులో సీట్లు దాదాపు నిండుకుంటున్నాయి. ముందుగా టికెట్లు ఖాళీలు కనిపిస్తున్నా..రైలు ప్రారంభం సమయానికి ప్రయాణీకులతో భర్తీ అవుతున్నాయి. ఈ అయిదు రోజుల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖ కంటే, విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వచ్చే వందేభారత్ కు ఎక్కవ ఆదరణ లభించినట్లు అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల్లో ప్రయాణీకులు మరింతగా వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
తిరుమల భక్తుల కోసం ప్రత్యేకంగా..
ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి పలు రైళ్లు భిన్న మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాయి. అయినా.. వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో.. వందేభారత్ రైలును సికింద్రాబాద్ - తిరుపతి మార్గంలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటుగా సికింద్రబాద్ నుంచి బెంగళూరు కూడా డిమాండ్ ఉన్న రూట్ కావటంతో... ఈ మార్గంలోనూ కొత్తగా వందేభారత్ ప్రతిపాదించారు. ఈ రెండు రైళ్లను ఏ మార్గంలో ప్రవేశ పెడతారనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక..సికింద్రాబాద్ - విజయవాడ మధ్య నిత్యం ఉండే డిమాండ్ కు అనుగుణంగా ఇంటర్ సిటీ రూటులో వందేభారత్ ను తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొలి విడతలో వందేభారత్ రైళ్ల కేటాయింపు కొనసాగుతోంది. రెండో దశలో ఈ మూడు రైళ్లు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications